దుబాయ్: నాకౌట్ అవకాశాలు గల్లంతైన తర్వాత.. టీమ్ఇండియా చివరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు నేడు బరిలోకి దిగనుంది. ఇప్పటికే సెమీస్ జట్లు తేలిపోగా.. సోమవారం జరుగనున్న నామమాత్ర పోరులో నమీబియాతో భారత్ తలపడనుంది. టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన విరాట్ కోహ్లీకి సారథిగా ఇదే చివరి మ్యాచ్ కాగా.. ఫలితంతో ప్రభావం లేకపోవడంతో ప్రయోగాలకు తెరలేపుతారా చూడాలి! టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని రాహుల్ చాహర్కు జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. గత రెండు మ్యాచ్ల్లో కలిసికట్టుగా విజృంభించిన భారత ఆటగాళ్లు.. మరోసారి అలాంటి ప్రదర్శనతోనే ఓదార్పు విజయంతో మెగాటోర్నీని ముగించాలని చూస్తుంటే.. టాప్ జట్టుకు కనీస పోటీనివ్వాలని నమీబియా భావిస్తున్నది. రవిశాస్త్రి నేతృత్వంలోని శిక్షణా బృందానికి ఇదే చివరి మ్యాచ్ కావడంతో విజయంతో కోచింగ్ స్టాఫ్కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భారత ఆటగాళ్లు ఆశిస్తున్నారు. 2012 తర్వాత ఐసీసీ టోర్నీల్లో టీమ్ఇండియా నాకౌట్ చేరకపోవడం ఇదే తొలిసారి కాగా.. ముందడుగు వేసే అవకాశం ఎలాగో లేకపోవడంతో భారత ఆటగాళ్లు ఆదివారం ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ను రద్దు చేసుకున్నారు.