ఇటీవల ఆస్ట్రేలియాపై సిరీస్ చేజిక్కించుకున్న రోహిత్ సేన.. మరో కప్పుపై కన్నేసింది. దక్షిణాఫ్రికాతో తొలి పోరులో బౌలర్లు విజృంభించడంతో మూడు మ్యాచ్ల సిరీస్లో ఆధిక్యంలో నిలిచిన టీమ్ఇండియా నేడు రెండో టీ20 ఆడనుంది. గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరం కాగా.. మరోసారి పేస్ బౌలింగ్ పరీక్షకు గురికానుంది.
గువాహటి: పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న సిరీస్ను చేజిక్కించుకునేందుకు టీమ్ఇండియా సమయాత్తమైంది. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన.. ఆదివారం గువాహటిలో మరోమారు సఫారీలను ఢీకొట్టనుంది. ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ సిరీస్తో పాటు ఆసీస్ వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్నకు కూడా దూరం కాగా.. మేనేజ్మెంట్కు కొత్తచిక్కులు ఎదురవుతున్నాయి. మెగాటోర్నీకి ముందు ఈ సిరీస్ను రిహర్సల్గా చూడాలని రాహుల్ ద్రవిడ్ భావిస్తే.. ఆటగాళ్ల గాయాలు మరిన్ని తలనొప్పులు తీసుకొచ్చాయి.
తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో యువ పేసర్లు అర్శ్దీప్ సింగ్, దీపక్ చాహర్, హర్శల్ పటేల్ రాణించడంతో రోహిత్ సేన సునాయాసంగా గెలుపొందగా.. వాళ్లు అదే స్థాయి ప్రదర్శన కొనసాగించాలని అభిమానులు అశిస్తున్నారు. గాయపడ్డ బుమ్రా స్థానంలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేసినా.. అతడికి తుది జట్టులో అవకాశం దక్కడం కష్టమే. మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘గాయంతో బుమ్రా ఈ సిరీస్కు మాత్రమే దూరమయ్యాడు. పొట్టి ప్రపంచకప్ జట్టు నుంచి అతడిని తప్పించలేదు. మెడికల్ రిపోర్ట్స్ జోలికి వెళ్లదలుచుకోలేదు.
నిపుణులు చెప్పేదానిపైనే ఆధారపడతా. రాబోయే రెండు మూడు రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి’ అని అన్నాడు. ఈ మాటలు బట్టి చూస్తే.. పూర్తిస్థాయిలో కోలుకోకపోయినా.. కనీస మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తే బుమ్రాను వరల్డ్ కప్ ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. తొలి పోరులో రోహిత్, కోహ్లీ విఫలమైనా.. రాహుల్, సూర్యకుమార్ అజేయ అర్ధశతకాలతో మెరువడంతో భారత్ అలవోకగా విజయం సాధించింది. ఇక్కడే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటున్న రోహిత్ గ్యాంగ్.. సమష్టిగా సత్తాచాటాలని చూస్తుంటే.. సిరీస్ సమం చేయాలని దక్షిణాఫ్రికా కృతనిశ్చయంతో ఉంది.
పిచ్, వాతావరణం
ఈ మైదానంలో రెండేండ్ల క్రితం జరుగాల్సిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రైద్దెంది. అంతకుముందు జరిగిన పోరులో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. శనివారం జట్లు ప్రాక్టీస్ సమయంలో బాగా ఎండకాసిందని ద్రవిడ్ అన్నాడు. అయితే మ్యాచ్ రోజు వర్ష సూచన ఉంది. అందుకుతగ్గట్లే అస్సాం క్రికెట్ సంఘం తగు ఏర్పాట్లు చేసింది. గతంలో ఒకసారి మ్యాచ్ రద్దు కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పిచ్తో పాటు మొత్తం మైదానాన్ని కప్పి ఉంచేందుకు తగిన కవర్స్ సిద్ధంగా ఉంచింది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, కార్తీక్, అక్షర్, హర్షల్, అశ్విన్, దీపక్, అర్శ్దీప్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, రాసో, మార్క్మ్,్ర మిల్లర్, స్టబ్స్, పార్నెల్, కేశవ్, రబడ, నోర్జే, షంసీ.
మెగాటోర్నీలకు ముందు ప్రధాన ఆటగాళ్లు గాయాల బారిన పడితే ప్రణాళికల్లో మార్పులు తప్పవు. బుమ్రా విషయంలో ఎక్కువ చర్చ జరుగుతున్నది. వికెట్కు తగ్గట్లు తుది జట్టు ఎంపిక చేసుకునేందుకు మా దగ్గర తగినన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. హర్షల్ పటేల్ మానసికంగా దృఢమైన ఆటగాడు. గత రెండేళ్లలో అతడి ప్రదర్శన గమనిస్తే మీకే అర్థమవుతుంది.
-రాహుల్ ద్రవిడ్, భారత కోచ్