డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం వరి రైతులపై తీవ్రంగా పడుతున్నది. దుక్కి దున్నడం నుంచి పంట విక్రయించే వరకూ రైతాంగమంతా యాంత్రీకరణపైనే ఆధారపడుతున్నది. కేంద్రం డీజిల్ ధరలు పెంచడంతో ఇటు వ్యవసాయ పెట్టుబడులూ పెరిగి కర్షకులకు భారంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో యాంత్రీకరణ ఎక్కువగా వినియోగించే వరి సాగు కంటే ఆరుతడి పంటలు వేస్తేనే మేలని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.
కోటగిరి/ బీర్కూర్, నవంబర్ 24:
ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రైతులు వరి సాగులో భాగంగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లను వాడుతున్నారు. రెండు సీజన్లలో పొలాలను సిద్ధం చేస్తారు. దుక్కులు దున్నడం, నాట్లు వేయడం, కట్టలు వేయడం వంటి వాటికి ట్రాక్టర్లు అవసరమవుతాయి. పంట కోతకు వచ్చిన తర్వాత హార్వెస్టర్లతో కోయిస్తారు. వడ్లను ట్రాక్టర్లలో మార్కెట్కు తీసుకెళ్తారు. డీజిల్, డ్రైవర్, ఇతర ఖర్చుల ఆధారంగా యజమానులు ధరలు నిర్ణయిస్తున్నారు. ఏడాదిగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు రైతుల పాలిట శాపంగా మారాయి. కిరాయిలు బాగా పెరిగి రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒక్కోసారి పెట్టుబడులూ రాక నష్టపోవాల్సి వస్తున్నది.
ఖర్చు తడిసి మోపెడు..
కూలీల కొరతను అధిగమించి యంత్రాలతో వ్యవసాయ పనులు చేసుకోవడం రైతులకు ప్రయోజనకరంగా మారింది. ట్రాక్టర్లు, టిల్లర్లు, వరి కోత యంత్రాలు, బ్లేడ్ ట్రాక్టర్లు పెద్ద ఎత్తున ఉంటాయి. వీటితోపాటు పురుగు మందులు పిచికారీ చేసేందుకు ఉపయోగించే తైవాన్ పవర్ స్ప్రేయర్లు వినియోగిస్తున్నారు. పెరిగిన డీజిల్ ధరలతో వీటి ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎకరాకు అదనంగా ఖర్చులు..
డీజిల్ ధరలు పెరగడంతో ఎకరానికి రూ.750 ఉన్న ట్రాక్టర్ కిరాయి ఏకంగా వంద రూపాయలు పెరిగి రూ.850 అయ్యింది. కోత యంత్రానికి రూ. 2500 ఉంటే వేయి రూపాయలు పెరిగి రూ.3500కి చేరుకున్నది. ఎకరం వరిపంట వేస్తే సుమారు రూ.25,300 పెట్టుబడి కాగా, దిగుబడి విషయానికి వస్తే ఎకరానికి 30 బస్తాలతో రూ.40వేలు చేతికి వస్తున్నాయి. ఆరు నెలలకు కేవలం 15వేల రూపాయలతోనే రైతు సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇక కౌలు రైతు విషయానికొస్తే మిగిలే 15వేలు సైతం పొలం యజమానికి పోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నది.
పంట ధరలూ పెంచాలి..
కేంద్రం ఆరేండ్లలోనే పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెం చింది. 2014లో రూ.75 ఉన్న పెట్రోల్, రూ.110, రూ.65 ఉన్న డీజిల్ రూ.94కు పెంచింది. అదే పంటలకు మాత్రం ధర పెంచలేదు. పంట ధరలు పెంచాలని రైతులు కోరుతున్నారు.
ఆరుతడి పంటలతో లాభాదాయకం
రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఆరుతడి పంటలను సాగు చేస్తే రైతులకు లాభాదాయకం. ఒకే రకమైన పంట సాగు చేయకుండా పంట మా ర్పిడి చేస్తే భూసారం పెరుగుతుంది. శనగ, పొద్దుతిరుగుడు, కందులతోపాటు ఇతరాత్ర పంటలు సాగు చేయాలి.
పంట మారిస్తేనే లాభాలు..
ఆరుతడి పంటలతోపాటు ఆకుకూరలు సాగు చేస్తున్నా.. పంట మార్పుతోనే అధిక లాభాలు పొందవచ్చు. ప్రభుత్వం, అధికారుల సూచనల మేరకు వరికి బదులుగా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసి పట్టణానికి తరలిస్తా. భూసారం ఉండాలంటే పంట మార్పిడి తప్పనిసరి. ప్రతి రైతూ ఆరుతడి పంటలు సాగు చేయాలి.
ఆరుతడిపై దృష్టి సారించాలి..
ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు, శనగ, కుసుమ, కూరగాయలు, ఆకు కూరలతోపాటు జొన్న, సజ్జలు, మినుములు, కందులు, బొబ్బర్లు, వేరుశనగ పంటల సాగుపై దృష్టి సారించాలి. ఆరుతడి పంటలతో రైతులు అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందవచ్చు.