గృహ వినియోగ విద్యుత్తుపై యూనిట్కు 50 పైసలే పెరుగుదల
డిస్కంల ప్రతిపాదన 18% 14 శాతానికే ఈఆర్సీ ఓకే
ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు
చరిత్రలో సబ్సిడీని 2281 కోట్లు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
అధిక నష్టాలున్న ప్రాంతాల్లో.. నష్ట నివారణకు ఈఆర్సీ ఆదేశం
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐదేండ్ల తర్వాత విద్యుత్తు చార్జీలు స్వల్పంగా పెరిగాయి. గృహ వినియోగ విద్యుత్తు చార్జీలను 10 పైసల నుంచి 50 పైసల వరకు పెంచుతున్నట్టు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ శ్రీరంగారావు ప్రకటించారు. లో-టెన్షన్-2 (ఎల్టీ-2) క్యాటగిరీలోని డొమెస్టిక్/వాణిజ్య రంగాలతోపాటు ఎల్టీ-3 క్యాటగిరీలోని పారిశ్రామిక రంగాలకు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని వీధి దీపాలకు ప్రతి యూనిట్పై రూపాయి చొప్పున పెంచుతున్నట్టు వెల్లడించారు. దేశంలోనే ఎక్కడా ఇవ్వని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పూర్తి ఉచితంగా విద్యుత్తును అందజేయడంతోపాటు అన్ని క్యాటగిరీల్లోని వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందజేసేందుకు రూ.38 వేల కోట్లతో పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేయడాన్ని గుర్తుచేశారు. దీనితోపాటు విద్యుత్తు కొనుగోలు ధరలు, సరఫరా, పంపిణీ చార్జీలు అధికమైన నేపథ్యంలో డిస్కంలు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోకుండా చూసేందుకు స్వల్పంగా విద్యుత్తు చార్జీలను పెంచాల్సి వచ్చిందని తెలిపారు.
దీంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.6.04గా ఉన్న యూనిట్ సగటు ధర ఇప్పుడు రూ.7.03కు పెరిగినట్టయ్యింది. ఈఆర్సీ సభ్యులు మనోహర్రాజు, బండారు క్రిష్ణయ్యతో కలసి రంగారావు బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యుత్తు చార్జీల పెంపునకు దారితీసిన కారణాలను వివరించారు. వాస్తవానికి విద్యుత్తు చార్జీలను 18% పెంచాలని డిస్కంలు ప్రతిపాదించినప్పటికీ అన్ని వర్గాల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలకు అనుగుణంగా 14 శాతం పెంపునకు మాత్రమే అనుమతించామన్నారు. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి (మే నెల బిల్లులో) అమల్లోకి వస్తాయని తెలిపారు.
రూ.48,708.27 కోట్లకు ఈఆర్సీ అంగీకారం
వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఆదాయ అవసరాల నిమిత్తం డిస్కంలు రూ.53,053.37 కోట్లకు ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ కమిషన్ రూ.48,708.27 కోట్లకే అంగీకారం తెలిపింది. ఆదాయానికి, వ్యయానికి మధ్య ఉన్న రూ.16,866.53 కోట్ల వెలితిని భర్తీ చేయాలని డిస్కంలు కోరగా.. వివిధ మార్గాల ద్వారా రూ.14237.40 కోట్లను రాబట్టుకొనేందుకు మాత్రమే కమిషన్ అనుమతించింది. ఇందులో పెంచిన విద్యుత్తు చార్జీల ద్వారా రూ.5,596.98 కోట్లు, సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచి రూ.8,221.17 కోట్లు, సీఎస్ఎస్ నుంచి రూ.247.90 కోట్లు, ఏఎస్ నుంచి రూ.171.35 కోట్లు డిస్కంలకు అందనున్నాయి.
కొత్త నిబంధనలు
ఏటా నవంబర్ 30లోగా ఏఆర్ఆర్ (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్) ప్రతిపాదనలను సమర్పించాలని కమిషన్ డిస్కంలను ఆదేశించింది. లేకపోతే జరిమానా విధిస్తామని తేల్చిచెప్పింది. రాష్ట్రంలోని సర్కిళ్లవారీగా 15% కంటే ఎక్కువగా విద్యుత్తు నష్టాలున్న ప్రాంతాల్లో నష్టాల నివారణకు చేపట్టిన చర్యల వివరాలను నిర్దేశిత సమయంలోగా నివేదించాలని తెలిపింది. విద్యుత్తు నష్టాలను 15% కంటే దిగువకు తీసుకురావడంలో విఫలమైతే డిస్కంలపై కమిషన్ కఠిన చర్యలు చేపడామని హెచ్చరించింది. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల బిగింపుతోపాటు జీడిమెట్లలోని స్మార్ట్గ్రిడ్ ప్రాజెక్టును వాణిజ్యపరంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని డిస్కంలను ఆదేశించింది.
సబ్సిడీకి అదనంగా రూ.2,280.70 కోట్లు
వ్యవసాయానికి, బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన) వర్గాలకు సబ్సిడీని పెంచాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం హర్షణీయమని ఈఆర్సీ పేర్కొన్నది. తమ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం సబ్సిడీ నిధులను రూ.2,280.70 కోట్ల మేరకు పెంచిందని, దీంతో ఈ రెండు క్యాటగిరీలకు ఇస్తున్న సబ్సిడీ మొత్తం రూ.8,221.17 కోట్లకు చేరిందని శ్రీరంగారావు వెల్లడించారు. ఇది గతేడాది కంటే 38.39 శాతం ఎక్కువని తెలిపారు.
కుటీర పరిశ్రమలకు పాత చార్జీలే
కుటీర పరిశ్రమలతోపాటు వ్యవసాయాధారిత కార్యకలాపాలకు అందజేసే విద్యుత్తు చార్జీలను పెంచలేదు. నెలలో 200 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించుకొనే హెయిర్ కటింగ్ సెలూన్లకు కూడా చార్జీలను పెంచలేదని ఈఆర్సీ వెల్లడించింది. ఫిక్స్డ్ చార్జీలను రూ.15కు పెంచాలని డిస్కంలు ప్రతిపాదించినప్పటికీ రూ.10 మాత్రమే వసూలు చేసేందుకు సమ్మతించినట్టు తెలిపింది.