కీవ్ : రష్యా దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పౌరులు ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. బాంబుల మోతతో భీతిల్లిన వారికి తమ రెస్టారెంట్లో ఉచితంగా ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహారం అందిస్తూ కీవ్లో భారతీయ రెస్టారెంట్ యజమాని ఔదార్యం చాటుకున్నాడు. తాను చేయగలిగినంత కాలం నిరాశ్రయులకు ఆహారం, షెల్టర్ అందిస్తానని నగరంలోని సాథియా రెస్టారెంట్ యజమాని మనీష్ దవే స్పష్టం చేశాడు. రష్యా కాల్పులతో పలువురు ఈ హోటల్లో తలదాచుకోవడంతో వారందరికీ కొద్ది రోజులుగా దవే ఆహారం అందిస్తున్నాడు.
ఇప్పుడు దవే రెస్టారెంట్ పలువురు చిన్నారులు, గర్భిణులు, విద్యార్ధులు, నిరాశ్రయులతో పాటు స్ధానిక వయో వృద్ధులకు ఆవాసంగా మారింది. ఇప్పటివరకూ దవే 132 మందికి పైగా ఆహారం, ఆశ్రయం కల్పించాడు. ఉక్రెయిన్లో చదువుతున్న భారత విద్యార్ధుల కోసం భారతీయ రెస్టారెంట్ను తెరిచే ఉద్దేశంతో దవే 2021లో గుజరాత్లోని వదోదర నుంచి ఉక్రెయిన్కు వచ్చాడు. ఉక్రెయిన్లో భారత సంస్కృతిని ప్రతిబింబించేలా తాను రెస్టారెంట్ను ఓపెన్ చేశానని దవే చెప్పుకొచ్చారు. జనవరిలో దవే రెస్టారెంట్ను ఓపెన్ చేశాడు. అన్నీ అనుకున్నట్టు జరుగుతుండగా అనూహ్యంగా ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎటు చూసినా కాల్పులు, పేలుళ్లు, బాంబుల మోతతో భయానక వాతావరణం నెలకొందని అన్నారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆశ్రయం కోసం తన తలుపు తట్టడంతో వారికి ఆసరాగా నిలవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. బేస్మెంట్ విశాలంగా ఉండటంతో నిరాశ్రయులకు అక్కడ ఆశ్రయం కల్పించాడు. ఈ సంక్షోభ సమయంలో సురక్షిత ప్రదేశంలో లేమని భావించిన వారంతా ఇక్కడకు రావచ్చని దవే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దవే ఔదార్యాన్ని స్ధానికులు ప్రశంసిస్తున్నారు.