హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఒక విద్యార్థి ఏదై నా కోర్సును స్వదేశంలో లేదంటే విదేశాల్లో పూర్తిచేయవచ్చు. కానీ, జేఎన్టీయూ ఒకే కోర్సును స్వదేశంతోపాటు విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజమే. ఇలాం టి ప్రత్యేకతలు గల రెండు కోర్సులను జేఎన్టీయూలో నిర్వహిస్తున్నారు. అమెరికాలోని సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీలో ఎంబీఏ, స్వీడన్లోని బ్లికింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీటీహెచ్) సహకారంతో ఐదేండ్ల మాస్టర్స్ డిగ్రీని జేఎన్టీయూ నిర్వహిస్తున్నది. ఈ రెండు కోర్సుల్లో ప్రవేశాలకు జేఎన్టీయూ నోటిఫికేషన్ కూడా విడుదలచేసింది.
ఐదేండ్లలో రెండు మాస్టర్.. ఒక బ్యాచిలర్ డిగ్రీ
మన దగ్గర బీటెక్ నాలుగేండ్లు, ఎంటెక్ రెండేండ్లు, ఎంఎస్ మరో రెండేండ్లు మొత్తంగా 8 ఏండ్లు చదవాల్సి ఉంటుంది. ఈ మూడు కోర్సులను ఐదేండ్లలో పూర్తిచేసే వెసులుబాటును జేఎన్టీయూ కల్పిస్తున్నది. ఇందుకు ఐదేండ్ల (బీటెక్, ఎంటెక్, ఎంఎస్) ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నది. ఈ కోర్సు పూర్తిచేస్తే ఐదేండ్లలోనే రెండు మాస్టర్స్, ఒక బ్యాచిలర్ డిగ్రీ పొందవచ్చు. ఈ కోర్సును స్వీడన్లోని బ్లికింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీటీహెచ్) సహకారంతో నిర్వహించనున్నారు. ఈ కోర్సులో చేరినవారు మూడున్నరేండ్లలో బీటెక్, ఎంటెక్ పూర్తిచేసి, మిగిలిన ఏడాదిన్నరలో ఎంఎస్ను స్వీడన్లోని బీటీహెచ్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తిచేసిన అభ్యర్థులు కోర్సులో చేరవచ్చు. 30 శాతం సీట్లను జేఈఈ మెయిన్స్, 70 శాతం సీట్లను ఎంసెట్ ర్యాంకుల ద్వారా భర్తీచేస్తారు. ఈ రెండు కోటాల్లో దేంట్లో సీట్లు మిగిలినా మరో కోటా నుంచి భర్తీచేయనున్నారు. పూర్తి వివరాలకు www jntuh.ac.inలో సంప్రదించవచ్చు.
మిచిగాన్లో ఎంబీఏ
విద్యార్థులు ఎంబీఏ ఫస్టియర్ను జేఎన్టీయూలో, సెకండియర్ను అమెరికాలోని సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీలో పూర్తిచేయవచ్చు. ఫైనల్ డిగ్రీని మిచిగాన్ వర్సిటీ పేరుమీదే ఇస్తారు. ఈ మేరకు రెండు యూనివర్సిటీల మధ్య అవగాహన ఒప్పందం కుదరగా.. 2021-22 విద్యాసంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేశారు. ఆసక్తిగలవారు రూ.2 వేలు ఫీజు చెల్లించి ఈ నెల 26 వరకు, ఆలస్య రుసుముతో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.