బీర్కూర్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో విద్యార్థులు కోడిగుడ్లు తిని అస్వస్థతకు గురయ్యారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం చేశారు. గంట తరువాత విద్యార్థులు వాంతులు చేసుకోవడం, కడుపులో నొప్పితో విలవిల లాడారు. ఉపాధ్యాయులు ఆలస్యంగా స్పందించి అస్వస్థతకు గురైన వారిని 108 అంబులెన్సులో బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తాసీల్దార్ రాజు, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఎస్సై రాజేశ్ , రైతు బంధు అధ్యక్షుడు అవారి గంగారాంలు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అస్వస్థతకు గల కారణాలను పరిశీలించగా మధ్యాహ్న భోజనంలో వడ్డించిన కోడిగుడ్డు వల్లే ఈ ఘటన జరిగినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. కాగా విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే , శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం రాత్రి దవాఖానలో విద్యార్థులను పరామర్శించారు.
బాద్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. దవాఖానలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అస్వస్థకు గురైన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. స్పీకర్ వెంట సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, బీర్కూర్ రఘు, జడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్ , ఎంపీటీసీ సందీప్ పాటిల్ ,నర సాయిలు లాడేగాం వీరేశం, అశోక్ , గురు వినయ్ కుమార్ ,దుంపల రాజు, బుడ్డ రాజు, లాయక్, కో ఆప్షన్ హరిఫ్ తదితరులు ఉన్నారు.