శేరిలింగంపల్లి, డిసెంబర్ 8: శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్పల్లి సర్వేనంబర్ 37 ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలసిన నిర్మాణాలు, గుడిసెలను రెవెన్యూ యంత్రాంగం కూల్చివేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు బుధవారం ఈ కూల్చివేతలు చేపట్టారు. చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ ఆధ్వర్యంలో పది జేసీబీల సహాయంతో దాదాపు 220 నివాసాలను నేలమట్టం చేశారు.
కబ్జా, అక్రమ నిర్మాణాలు..
20 ఏండ్ల క్రితం తమిళనాడు నుంచి నగరానికి వలసవచ్చి రాళ్లు కొట్టుకుని జీవించే దాదాపు 40 కుటుంబాలు గోపన్పల్లిలోని సర్వేనంబర్ 37లోని ఎకరం ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. కొంత కాలం తర్వాత ఈ ప్రాంతం బసవతారక్నగర్గా పేరొందింది. సర్వేనంబర్ 37లోని మిగతా 5 ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలంలో ఇటీవల పెద్ద ఎత్తున అక్రమంగా గుడిసెలు, చిన్న ఇండ్లు నిర్మించారు.
బుధవారం చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, శేరిలింగంపల్లి డిప్యూటీ తాసీల్దార్ వంశీమోహన్ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. బాధితులు ఈ కూల్చివేతలను అడ్డుకొని రెవెన్యూ, పోలీసు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపివేసి అడ్డంగా బైఠాయించారు. పోలీసులు వారిని అక్కడి నుంచి
చెదరగొట్టారు.
కూల్చివేతలు.. అడ్డుకున్న బాధితులు
కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను, కార్పొరేటర్ గంగాధర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి నార్సింగి పోలీస్స్టేషన్కు తరలించారు. మధ్యాహ్నం రవి, వెంకటేశ్ అనే ఇద్దరు యువకులు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నాగరాజు అనే యువకుడు సొమ్మసిల్లి పడిపోవడంతో పోలీసులు అంబులెన్స్లో దవాఖానకు తరలించారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ రఘునందన్రావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు: చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ
గోపన్పల్లిలోని సర్వేనంబర్ 37లో 6 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసేందుకు పెద్ద ఎత్తున గుడిసెలు, గదులు నిర్మించారు. గుర్తించి 220 అక్రమ నిర్మాణాలను కూల్చివేశాం. డబుల్ బెడ్ రూం పథకంలో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అర్హులైన పేద ప్రజలకు రెండు పడకల గదుల కేటాయింపును పరిశీలిస్తాం. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే సహించం. చట్టరీత్యా చర్యలు ఉంటాయని ఆర్డీవో తెలిపారు.