Illegal Mining| మొయినాబాద్, జూన్ 27 : ప్రభుత్వ భూమిలో ఏం చేయాలన్నా అధికారుల అనుమతి తప్పనిసరి అని తెలిసిందే. అయితే వీళ్లకు మాత్రం అవేం పట్టింపులేదు. ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు ఓ ప్రైవేట్ రిసార్ట్ కోసం ప్రభుత్వ భూమిలో నుంచి యథేచ్చగా ట్రాక్టర్ల కొద్దీ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.
ప్రభుత్వం భూమి నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి ఓ ప్రైవేట్ రిసార్ట్ పార్కింగ్ స్థలంలో పోస్తున్నారు. ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారని రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి గ్రామ రెవెన్యూలో అర్థ్ రిసార్ట్ ఏర్పాటు చేశారు. అయితే రిసార్ట్ కు పార్కింగ్ స్థలము లేకపోవడంతో పక్కనే ఓ రైతు పొలమును పార్కింగ్ స్థలం కోసము లీజుకు తీసుకున్నారు. అయితే ఆ భూమిలో నల్ల మట్టి ఉండడంతో పార్కింగ్ స్థలానికి పనికొచ్చే విధంగా అందులో మొరం పోస్తున్నారు. అందులో వేస్తున్న మొరం కనకమామిడి రెవెన్యూలోని 510 సర్వే నెంబర్ లో నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి రిసార్ట్ పార్కింగ్ స్థలానికి తరలిస్తున్నారు.
మూడు జేసీబీలు సుమారుగా 10 ట్రాక్టర్లను పెట్టి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టిని అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.

