తాండూరు, జూలై 2 : మండలంలోని విశ్వనాథ్పూర్ గ్రామం వద్ద కాక్రవేణి వాగుపై నిర్మాణమైన శివసాగర్ ప్రాజెక్టు అంతర్భాగం నుంచి కొడంగల్ వెంకటేశ్వరాలయం పేరిట పెద్ద ఎత్తున ఇసుకను తరలించడంపై బీఆర్ఎస్ పార్టీ యాలాల మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి గురువారం కలెక్టర్కు ఫిర్యాదు చేశా రు. కేవలం మూడు క్యూబిక్ మీటర్ల ఇసుక తరలింపునకు కొందరు కాంగ్రెస్ నాయకులు అనుమతులు తీసుకుని వందలాది మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రాజెక్టు నుంచి తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వెంకటేశ్వరాలయానికి 5 వేల మెట్రిక్ టన్నుల ఇసుకే అవసరమవుతుందని వికారాబాద్ జిల్లా ఆర్అండ్బీ అధికారులు అంచనా వేశారని.. కానీ, వారు అధికంగా అక్రమంగా తరలిస్తుండడంతో శివసాగర్ ప్రాజెక్టు ఉనికికే ప్రమా దం ఉందని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇసుక తరలింపునకు అనుమతులిచ్చిన తహసీల్దార్ వ్యవహారశైలిపైనా అనుమానం ఉంద న్నారు. గత నెలలో డిప్యుటేషన్పై వచ్చిన తహసిల్దార్ యాలాల పీఎస్లో జప్తులో ఉం చిన ఇసుకను గుట్టుచప్పుడు కాకుండా వేలం వేయించినట్టు ఆరోపణలున్నాయన్నారు. కాగా, ఆయన శివసాగర్ ప్రాజెక్టు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా బీఆర్ ఎస్ శ్రేణులతో కలిసి అడ్డుకున్నారు.
రైతులతో కలిసి అడ్డుకుంటాం..
శివసాగర్ ప్రాజెక్టు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే రైతులతో కలిసి అడ్డుకుంటాం. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తే శివసాగర్ ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం. అలాగే, ప్రాజెక్టు పరీవాహక ప్రదేశాల్లోని పంట పొలాలకు, పర్యావరణానికి హాని కలుగుతుంది. వికారాబాద్ కలెక్టర్ ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించి ఇసుక అక్రమ రవాణాను వెంటనే నిలిపివేయించాలి. సంబంధికులపై చర్యలు తీసుకోవాలి.
-పంజుగుల శ్రీశైల్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇన్చార్జి