పుణె/న్యూఢిల్లీ/జైపూర్, డిసెంబర్ 5: ఒమిక్రాన్ దేశాన్ని వణికిస్తున్నది. చాపకింద నీరులా పాకుతున్నది. ఇప్పటికే దేశంలో ఈ వేరియంట్ నాలుగు కేసులు నమోదు కాగా.. ఆదివారం ఒక్కరోజునే 17 కేసులు వెలుగుచూశాయి. ఇందులో 9 కేసులు రాజస్థాన్లో నమోదవ్వగా.. 7 కేసులు మహారాష్ట్రలో రికార్డు అయ్యాయి. ఢిల్లీలో ఒక కేసు బయటపడింది. పాతవాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది. దక్షిణాఫ్రికా నుంచి రాజస్థాన్కు వచ్చిన ఓ కుటుంబంలో ఒమిక్రాన్ బయటపడింది. 9 మందికి ఈ వేరియంట్ సోకినట్టు తేలింది. వెంటనే అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. మహారాష్ట్రలో వెలుగుచూసిన 7 కేసులన్నీ పుణె జిల్లాలోనివే. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తి కూడా ఒమిక్రాన్ సోకింది. దేశ రాజధానిలో ఒమిక్రాన్ తొలి కేసు ఇదే.
ఫిబ్రవరిలో కేసుల సంఖ్య పైపైకి
వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో దేశంలో థర్డ్వేవ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఐఐటీ-కాన్పూర్ ప్రొఫెసర్ డాక్టర్ మనీంద్ర అగర్వాల్ చెప్పారు. దేశమంతటా ఈ వేరియంట్ విస్తరించవచ్చన్నారు. ఫిబ్రవరిలో కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుకోవచ్చని, అయితే సెకండ్వేవ్ అంత తీవ్రత థర్డ్వేవ్లో ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ ప్రమాదకారి అని, వేగంగా విస్తరిస్తున్నదని పలు వార్తలు వస్తున్నాయని.. అయితే ఈ కొత్త వేరియంట్పై ఇప్పుడే మనం ఒక అంచనాకు రావడం సరికాదని అగర్వాల్ తెలిపారు. ‘ఇప్పటికే దేశంలో చాలా మంది వైరస్ బారిన పడి కోలుకున్నారు. దీంతో వారిలో ఇమ్యూనిటీ పెరిగింది. అలాగే ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ రెండు అంశాలను లెక్కల్లోకి తీసుకుంటే భారతీయులపై ఒమిక్రాన్ ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చు’ అని వెల్లడించారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తే ఒమిక్రాన్ను నిలువరించవచ్చని వివరించారు.
ఐసీయూ అవసరం పెద్దగా రాదు
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘ఒమిక్రాన్లో ఆర్నాట్ విలువ, విరులెన్స్ అధికంగా ఉండటంతో వైరస్ వ్యాప్తి వేగం అధికంగా ఉన్నది. ప్రభావం మాత్రం పెద్దగా కనిపించటం లేదు. ఆక్సిజన్, ఐసీయూ అవసరం పెద్దగా రాలేదు. కాకపోతే ఈ వేరియంట్ను శరీరంలోని యాంటిబాడీస్ గుర్తించవు. వ్యాక్సిన్ తీసుకొంటే వైరస్ ముప్పు పెద్దగా ఉండదు’ అని మెడికవర్ హాస్పిటల్ కార్డియాలజిస్టు డాక్టర్ అనిల్ కృష్ణ పేర్కొన్నారు.
వెన్నునొప్పి, తలనొప్పి, తీవ్ర అలసట
డెల్టా వేరియంట్ సోకితే శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడటం, జలుబు చేయడం, ఒళ్లు నొప్పులు, తీవ్ర జర్వం లాంటి లక్షణాలు బయటపడేవి. కానీ ఒమిక్రాన్ లక్షణాలు వీటికి పూర్తి భిన్నంగా ఉన్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా తలనొప్పి, తీవ్రమైన అలసట, వెన్ను నొప్పి.. ఈ మూడు లక్షణాలు ఒమిక్రాన్ సోకినవారిలో ఉంటున్నట్టు దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏంజెలిక్ కోయెట్జీ చెప్పారు. అంతేగాక ఈ వేరియంట్ సోకినవారిలో జ్వరం కనిపించడం లేదని, రుచి, వాసనను కోల్పోవడం లేదని తెలిపారు. అయితే ఒమిక్రాన్ రోగిలో ఇప్పటికీ తేలికపాటి లక్షణాలే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.