న్యూఢిల్లీ, జూలై 15: ఐఐటీ మద్రాస్ మరో ఘనత సాధించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్-2022 ఏడవ ఎడిషన్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ర్యాంకులు విడుదల చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు, ఐఐటీ-బాంబే రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక యూనివర్సిటీల క్యాటగిరీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు మొదటి స్థానం సంపాదించుకోగా, ఢిల్లీలోని జేఎన్యూ, జామియా మిలియా ఇస్లామియా వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
పలు క్యాటగిరీల్లో ఇలా..
ఇక కాలేజీల క్యాటగిరీలో ఢిల్లీలోని మిరండా హౌస్ కాలేజీ, ఇంజినీరింగ్లో ఐఐటీ-మద్రాస్, మేనేజ్మెంట్ క్యాటగిరీలో ఐఐఎం-అహ్మదాబాద్, మెడికల్ క్యాటగిరీలో ఢిల్లీ ఎయిమ్స్, లా విద్యాసంస్థల క్యాటగిరీలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ అగ్రస్థానాలు పొందాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన జేఎన్యూ, జామియా మిలియా వర్సిటీల్లోని విద్యార్థులను దేశ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించేందుకు మోదీ సర్కార్, బీజేపీ నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఇప్పుడు అదే కేంద్రం ఆయా విద్యాసంస్థలను యూనివర్సిటీల క్యాటగిరీలో టాప్-3 జాబితాలో ప్రకటించడం విశేషం.