న్యూఢిల్లీ, జూన్ 1: ఎలక్ట్రానిక్ వాహనాల్లో వాడుతున్న లిథియం అయాన్ బ్యాటరీలు పేలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న వేళ ఐఐటీ మద్రాస్ పరిశోధకులు సమస్య పరిష్కారం వైపు ముందడుగు వేశారు. జింక్-ఎయిర్ బ్యాటరీని తయారు చేశారు. బ్యాటరీ నమూనాను ప్రదర్శించారు. ‘లిథియం అయాన్ బ్యాటరీల కంటే జింక్-ఎయిర్ బ్యాటరీలు పర్యావరణ హితమైనవి. ధర తక్కువ. తయారు చేయడం సులువు. అంతే కాకుండా లిథియం బ్యాటరీల్లాగే మైలేజీ ఇస్తాయి’ అని ఐఐటీ మద్రాస్ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అరవింద్ చంద్రియాన్ అన్నారు.
‘ఈ బ్యాటరీల్లో జింక్ ఒక ఎలక్ట్రోడ్. రెండో ఎలక్ట్రోడ్ ఆక్సిజన్. నీళ్లు ఎలక్ట్రోలైట్గా పనిచేస్తాయి. కాబట్టి ఇది పేలిపోయే అవకాశమే లేదు. ఒక వేళ బ్యాటరీ ఫెయిల్ అయితే విద్యుత్తు సరఫరా ఆగిపోతుంది అంతే’ అని వివరించారు. లిథియం బ్యాటరీల స్థానంలో వీటిని అమర్చడం కూడా పెద్ద కష్టమేమీ కాదన్నారు. ‘మేం 1.3-2.3 కిలోవాట్ అవర్ బ్యాటరీని తయారు చేశాం. ఇది ఈ-స్కూటర్కు సరిపోతుంది’ అని చంద్రియాన్ తెలిపారు. అయితే, ‘జింక్ ఎయిర్ బ్యాటరీలు కేవలం టూ వీలర్, త్రీ వీలర్కు మాత్రమే సరిపోతాయి. కార్లకు పనిచేయవు. కార్లు అంతకంటే భారీ వాహనాలకు అవసరమైనంత విద్యుత్తును ఈ బ్యాటరీలు వేగంగా అందజేయలేవు’ అని పేర్కొన్నారు.