ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంట చౌరస్తా/జమ్మికుంట, అక్టోబర్ 26 : ఉప ఎన్నికలో ఈటలకు ఓటేస్తే.. బీజేపీ పెంచుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను ఆమోదించినట్టు అవుతుందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం జమ్మికుంటలోని 1, 2, 3, 5వ వార్డుల్లో ఎమ్మెల్యే చందర్, పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తాతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ నిత్యవసరాల ధరలను పెంచుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికలు అయిపోగానే సిలిండర్ ధరను రూ.200 పెంచేందుకు రంగం సిద్ధం చేసిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో దళితబంధు మాదిరిగా బహుజన బంధు ఇచ్చే ఆలోచనతో ఉన్న సీఎంకు అందరం సంపూర్ణ మద్దతు పలుకుదామని కోరారు. గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని పిలుపునిచ్చారు.