ఒక పదునైన మాట పది దెబ్బలతో సమానం. అందుకే పిల్లలకు మాట్లాడటం నేర్పించమని చెబుతారు జానపదులు. మాట్లాడ నేర్పించడం అంటే.. ‘అమ్మా.. ఆవు, ఇల్లు.. ఈగ’ కాదు. సమాజం గురించి నేర్పించడం. తెలివిగా వ్యహరించేలా, నలుగురినీ మెప్పించేలా ఎలా మాట్లాడాలో బోధించడం. అన్నీ వివరంగా చెబితే.. పెద్దయిన తర్వాత ప్రతి విషయంలోనూ మంచి చెడులు బేరీజు వేసుకుంటారు. ఒకవేళ ఎవరితోనైనా పోట్లాడే సందర్భం వచ్చినా.. తెలివిగా తప్పించుకోగలుగుతారు.
కలిసి కూర్చుని మాట్లాడుకోవడం వల్లే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. పంచాయితీల దగ్గర కూడా మాటకే విలువ ఉంటుంది. పెద్దలు చెప్పిన మాటే ఊరికి శాసనం. ఊరిపెద్ద మాటకు ఊరంతా కట్టుబడాల్సిందే. మాట చాలా పదునైన ఆయుధం. ఎలాంటి పోట్లాట వచ్చినా తెలివిగా మాట్లాడితేనే గెలుస్తారు. అందుకే పిల్లలకు మాట్లాడటం నేర్పమన్నారు పెద్దలు. లేకపోతే ‘నోట్లో నాలుక లేనోడు’ అనే ముద్ర వేస్తారు. పౌరుషం ఉన్న మనిషికి మాటతోనే సమాధానం చెప్పాలి కాబట్టే ‘మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ’ అని కూడా అన్నారు.