ధర్మపురి, మే 1: పట్టుదలతో చదివితే ప్రభుత్వ కొలువు సాధించడం సులువేనని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతస్థాయిలో స్థిరపడాలని యువతకు పిలుపునిచ్చారు. ఆదివారం సాంఘిక సంక్షేమశాఖ, ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో ‘ధర్మపురి ఈ-క్లాస్’ పేరిట ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. కరీంనగర్కు చెందిన లక్ష్యం, వికాస్ అకాడమీల ఆధ్వర్యంలో కోచింగ్ ఇస్తారని చెప్పారు. పోలీసు ఉద్యోగాలకు రెండు నెలలు, గ్రూప్స్ జాబ్స్కు 3 నెలల శిక్షణతోపాటు స్టడీ మెటీరియల్, మధ్యాహ్నభోజన వసతి ఉంటుందని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.