హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశానికే ఆదర్శంగా నిలిచేలా బీసీలకు అన్ని హంగులతో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. ఈ భవనాల్లో పిల్లలు చదువుకునేందుకు కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లతోపాటు కల్యాణ మండపాలు వంటి వసతులు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో మంగళవారం వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 41 కుల సంఘాల వారు ఎవరికి వారు ఈ నెల 17లోగా ఒక ట్రస్ట్గా ఏర్పడి, ప్రభుత్వానికి ఏకగ్రీవ తీర్మానం ఇవ్వాలని చెప్పారు.
ఈ నెల 21, 22వ తేదీల్లో కుల సంఘాలకు భూమి పట్టాలు అందజేస్తామని వెల్లడించారు. వచ్చే జనవరి-ఫిబ్రవరిలో నిర్మాణాలను ప్రారంభించుకొని, ఏడాది, ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని వివరించారు. ఆత్మగౌరవ భవనాలను కట్టుకుంటామంటే వాళ్లకే అప్పగిస్తామ ని లేదంటే ప్రభుత్వమే కట్టిస్తుందని చెప్పారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. చట్టసభల్లో ఈ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ కులగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపినా.. కేంద్రంలో చలనం లేదని మండిపడ్డారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏడేండ్లలో వెనుకబడిన వర్గాలకు అన్ని రకాలుగా అండగా నిలిచిందని పేర్కొన్నారు.
డ్రగ్స్ కట్టడికి కేంద్రానికి లేఖ రాస్తాం: మంత్రి శ్రీనివాస్గౌడ్
మత్తు పదార్థాల కట్టడికి మరింత కఠిన వైఖరి అనుసరిస్తున్నట్టు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. డ్రగ్స్ విదేశాల నుంచే మన దేశంలోకి వస్తున్నందున వాటిని నియంత్రించేలా దేశ సరిహద్దులతోపాటు విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో గట్టి నిఘా ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్తోపాటు ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయి.. తెలంగాణ మీదుగా ముంబై, పుణె, గోవా సహా ఇతర రాష్ర్టాలకు తరలుతున్నదని చెప్పారు. గంజాయి సహా మత్తు పదార్థాలు విక్రయించేవారిపై పీడీయాక్ట్లు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. గంజాయి సాగుచేస్తే రైతుబంధు, రైతుబీమా పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. మత్తు పదార్థాల రవాణా సమాచారం ఇచ్చేవారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ఆయన ప్రకటించారు. మత్తు పదార్థాల కట్టడిలో బాగా పనిచేసే పోలీస్, ఎక్సైజ్ సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తామని పేర్కొన్నారు.