న్యూఢిల్లీ : ఉద్యోగులు సెకండ్ జాబ్ చేసే (మూన్లైటింగ్) వ్యవహారంపై పలువురు టెక్ దిగ్గజాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న క్రమంలో మూన్లైటింగ్పై ఐటీ వర్గాల్లో హాట్ డిబేట్ సాగుతోంది. ఉద్యోగులు మరో ఉద్యోగం చేస్తే ఇంటికి సాగనంపుతామని ఇన్ఫోసిస్ ఇటీవల తమ ఉద్యోగులను హెచ్చరించగా మూన్లైటింగ్గా వ్యవహరించే ఉద్యోగుల సెకండ్ జాబ్పై తాజాగా ఐబీఎం గళమెత్తింది.
రెండు ఉద్యోగాల పద్ధతి నైతికంగా సరైంది కాదని ఐబీఎం స్పష్టం చేసింది. మూన్లైటింగ్ లేదా పనిప్రదేశంలో రెండు ఉద్యోగాలు చేపట్టే ఎలాంటి చర్యలనూ సహించేది లేదని తేల్చిచెప్పింది. ఉద్యోగులందరూ వారు కంపెనీలోకి ప్రవేశించే ముందు ఐబీఎంకు పూర్తి సమయం పనిచేస్తామని ఒప్పందంపై సంతకం చేస్తారని మూన్లైటింగ్ ఈ ఒప్పందానికి విరుద్ధమని, ఇది నైతికంగా సరైంది కాదని ఐబీఎం ఇండియా బాస్, ఎండీ సందీప్ పటేల్ పేర్కొన్నారు.
మూన్లైటింగ్పై పరిశ్రమ ఇప్పటికే తన వైఖరిని వెల్లడించిందని ఆయన చెప్పారు. కాగా మూన్లైటింగ్కు కంపెనీ పూర్తి వ్యతిరేకమని దేశీ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇప్పటికే తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో పేర్కొంది. పని వేళల్లో, పని వేళల అనంతరం ఆదాయం ఆర్జించేలా రెండో జాబ్ చేస్తూ పట్టుబడిన వారిని విధుల నుంచి తొలగిస్తామని కంపెనీ హెచ్చరించింది.