భీంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి , బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) అన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో మన ఊరు-మన బడి ( Mana Ooru – Mana Badi ) కింద చేపట్టిన పనుల పెండింగ్ బిల్లుల ( Pending Bills ) విషయాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతా అని వెల్లడించారు.
ముచ్కూర్, భీంగల్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం దాత దయానంద్ రెడ్డి అందించిన సుమారు 2 లక్షల విలువైన 50 డ్యూయల్ డెస్క్ బెంచీలను గురువారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు, విద్యాభివృద్ధికి సంబంధించిన అంశాల్లో రాజకీయాలు చేయడం తగదని స్పష్టం చేశారు. గురువుల ఆశీస్సులతోనే జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, సమాజా భివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ముచ్కూర్లో కాంట్రాక్టర్లు సొంత నిధులతో శ్లాబ్ పనులు పూర్తి చేయగా వాటికి సంబంధించిన సుమారు రూ.30 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే దాతలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సయ్య, మాజీ జడ్పీటీసీ రవి, మాజీ ఎంపీపీ మహేష్, కౌన్సిలర్లు నీలం రవి, భగత్, నర్సాయ్స, మల్లెల ప్రసాద్, ముచ్కూర్ గ్రామ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.