హైదరాబాద్: దేశ జనాభాలో అధిక శాతం మంది పేదవాళ్లే అని, కేంద్రమైనా లేక రాష్ట్రమైనా.. వారి కోసం సంక్షేమ పథకాలను రూపొందిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేంద్రం, బీజేపీ అవమానిస్తోందని, వాటిని ఉచితాలుగా చిత్రీకరిస్తున్నట్లు కవిత చెప్పారు. సంక్షేమ పథకాలను ఉచితాలుగా పిలువరాదు అని బీజేపీని కవిత కోరారు. సంక్షేమ పథకాలను ఉచితాలు అనడం పేదల్ని అవమానించడమే అని,ఇటీవల కార్పొరేట్ బ్యాంకులను లూటీ చేసిన వారికి 10 లక్షల కోట్ల రుణాన్ని ఎత్తివేయడం ఉచితం అవుతుందని ఆమె ఆరోపించారు.
పేదల ఆరోగ్యం, వ్యవసాయం, పిల్లల చదువుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఇవి ఏవీ కూడా ఉచితం కాదు అని కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మద్దతు ఇవ్వాలని, మద్దతు ఇవ్వకున్నా కనీసం స్వేచ్ఛను ఇవ్వాలని, ఎందుకంటే ఆ రాష్ట్రాలు ఆ స్కీమ్లను అమలు చేస్తామని కవిత తెలిపారు. ఉచిత స్కీమ్లను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర వత్తిడి తెస్తున్న తీరు సరిగా లేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఇది పేద ప్రజలను ఆదుకోదన్నారు.