న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో 90.57 మీటర్ల ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొట్టాలనుకొన్నట్లు గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా తెలిపారు. అయితే దానిని ఇప్పుడు సాధించలేకపోయినా త్వరలో సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు తొలి స్వర్ణ పతాకం తెచ్చిన నీరజ్ చోప్రా అనంతరం ఏఎన్ఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సంవత్సరం తనకు చాలా ముఖ్యమైనదని అన్నారు. రెండు మూడు అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడం తనకు చాలా సహాయపడిందని చెప్పారు. అందువల్ల ఒలింపిక్స్లో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, తన ప్రదర్శనపై దృష్టి పెట్టగలిగినట్లు తెలిపారు.
ఒక మంచి మొదటి త్రో చాలా విశ్వాసం ఇస్తుందని, ఇతరుపై అది ఒత్తిడి తెస్తుందని నీరజ్ చోప్రా తెలిపారు. తన రెండవ త్రో కూడా చాలా స్థిరంగా ఉందన్నారు. తన వ్యక్తిగత ఉత్తమమైనది 88.07 మీటర్లని అన్నారు. కాబట్టి 90.57 మీటర్ల ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నాన్నాని, అయితే అది సాధించలేకపోయినా తన వంత బెస్ట్ ఇచ్చినట్లు వెల్లడించారు. త్వరలో 90 మీటర్ల లక్ష్యాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
2019లో ఓపెన్ నేషనల్లో అర్హత సాధించానని, దీంతో విమాన టికెట్లు బుక్ చేశారని నీరజ్ చోప్రా తెలిపారు. అయితే అదిల్ సర్ తనకు ఫోన్ చేసి ఒలింపిక్స్పై దృష్టి పెట్టమని చెప్పారన్నారు. దీంతో ఓపెన్ నేషనల్ పోటీ నుంచి తప్పుకుని ఒలింపిక్స్కు కష్టపడినట్లు తెలిపారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదని భావిస్తున్నానని అన్నారు. ఏళ్ల తరబడి కఠోర సాధన, చాలా మంది ప్రజల మద్దతు ఈ రోజు ఈ ఘనత సాధించడానికి తనకు సహాయపడిందన్నారు. తాను ఇవాళ ఈ పతకం గెలిచినందున, మనం ఏదైనా చేయగలమని భావిస్తున్నానని నీరజ్ చోప్రా అన్నారు. మరింత మంది ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ)కి ఆయన విజ్ఞప్తి చేశారు.