ముంబై : తెలంగాణలోని కరీంనగర్లో ఓ వ్యక్తి మటన్ దుకాణానికి నటుడు సోనూసూద్ పేరు పెట్టాడు. ఇది వార్తాంశంగా ప్రచారమై సోనూసూద్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ నేను శాఖాహారిని.. అటువంటిది నా పేర మటన్ షాపు? అని చమత్కరించాడు. అతను శాఖాహార సంబంధ దుకాణానికి నేనేమైన సహాయం చేయగలనా? అని సోనూసూద్ పేర్కొన్నాడు.
కొవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్లో సైతం సోనూసూద్ కొవిడ్ రోగులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేయడం, ఇతర అవసరమైన మందులు, పరికరాలను అందజేస్తుండటం మనమంతా చూస్తున్నదే. జూన్లో ఆంధ్రప్రదేశ్లో పలు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఇటీవలే తెలిపాడు.
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో మొదటి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జూన్ నెలాఖరులో ఏపీలోని ఆత్మకూరు, నెల్లూరులో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ భారతదేశానికి మద్దతునిచ్చే సమయమిదని సోనూసూద్ అన్నారు.