మహిళా సాధికారత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం
అంగన్వాడీలు, ఆశావర్కర్లతో కవిత ముచ్చట
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లను తన ఇంటికి పిలిచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా దినోత్స వేడుక నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర మహిళాభ్యుదయం కోసం చేస్తున్న కార్యక్రమాలపై వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వారితో కలిసి అల్పాహారం చేసి, కేట్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా సాధికారత, ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. సర్కారు పాఠశాలల్లో 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థినులకు ప్రభుత్వం హైజినిక్ కిట్లు అందించనున్నదని, రాష్ట్రంలో 7 లక్షల మంది విద్యార్థులకు హైజినిక్ కిట్లు అందనున్నాయని చెప్పారు. కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ల పేరుతో మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రభుత్వం తెచ్చిందని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు, ఆశా వర్కర్లకు వేతనాలు పెంచి గౌరవించిన మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు.