తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 18: శివుడికి ప్రీతికరమైన కార్తిక మాసంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు నిమిత్తం నిర్విరామ నృత్యంతో 14 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ పూర్తి చేసిన నగరానికి చెందిన కళాకారులు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. సికింద్రాబాద్కు చెందిన భావనాలయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో ప్రముఖ నృత్య గురువు వట్టికోట యాదగిరాచార్య 18మంది శిష్యులతో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అరుణాచలంలో ఉదయం 6:45 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఐదున్నర గంటల పాటు నిర్విరామంగా కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు.
దీన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు రికార్డు చేశారు. యాదగిరాచార్యతో పాటు శిష్య బృందం వి.దేవహర్హ, టీకే.సుధీశన, బి.తనుశ్రీ, ఎం.శ్రీహర్షిత, ఎం.రాజేశ్వరి సాహిత్య, ఎస్.శృతి, ఎస్.పావనిశ్రీలాస్య, సి.కృతి, బి.శ్రీనిత, సి.అనన్య, పి.సంజన, ఎం.విశ్లేష, సి.అక్షయ, జి.నేహా, పి.రిషితరెడ్డి, పి.ప్రహర్షిత, ఎ.దేవిప్య, సి.స్నిగ్థశ్రీలను అరుణాచలేశ్వర దేవాలయం జాయింట్ కమిషనర్ కేపీ ఆశోక్ కుమార్, శ్రీవణమామలై మఠం జనరల్ మేనేజర్ పి.రామసుబ్రహ్మణ్యన్, అన్నపూర్ణ ఆశ్రమం సభ్యులు శివంస్వామి అభినందించారు.