అంబర్పేట: బ్రెజిల్ వేదికగా మే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక బధిర ఒలింపిక్స్కు రాష్ర్టానికి చెందిన యువ టెన్నిస్ ప్లేయర్ భవానీ కేడియా ఎంపికైంది. మే 1 నుంచి 15 వరకు జరిగే ఈ మెగాటోర్నీలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్న ఏకైక ప్లేయర్గా భవానీ నిలిచింది. సికింద్రాబాద్లోని సెయింట్ఆన్స్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఈ టెన్నిస్ ప్లేయర్.. టర్కీలో 2018, 19లో ప్రపంచ డెఫ్ టెన్నిస్ చాంపియన్షిప్లలోనూ ఆకట్టుకుంది. ఖేలో ఇండియా గేమ్స్(2017)లో రాణించిన భవానీ ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో నెల్లూరి కిరణ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నది. బధిర ఒలింపిక్స్కు ఎంపికవడంపై భవానీ మాట్లాడుతూ ‘టెన్నిస్ ఆటను బాగా ఇష్టపడుతాను. 2018 ప్రపంచ చాంపియన్షిప్నకు ఎంపికయ్యాను. కోచ్ కిరణ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాను. కరోనా వైరస్ విజృంభణ సమయంలోనూ గంటల కొద్ది ప్రాక్టీస్ చేశాను. ఆటతో పాటు ఫిట్నెస్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాను. డెఫ్ ఒలింపిక్స్లో సత్తాచాటుతానన్న నమ్మకం నాకుంది’ అని పేర్కొంది. మరోవైపు కోచ్ కిరణ్ స్పందిస్తూ ‘భవానీ చాలా కష్టపడే ప్లేయర్. లక్ష్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నది. రాష్ట్రం నుంచి ఒలింపిక్స్లో ఆడుతున్న ఏకైక ప్లేయర్ భవానీ కావడం గర్వంగా ఉంది’ అని అన్నాడు. ఇదిలా ఉంటే ప్రతిష్ఠాత్మక టోర్నీలో భవానీ పతకంతో తిరిగి రావాలని బాగ్ అంబర్పేట సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ వాసులు ఆకాంక్షించారు.