హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవుల దృష్ట్యా పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం మే 9న పాస్పోర్ట్ మేళా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేళాతో నాలుగు వేల సాధారణ స్లాట్స్ అదనంగా అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ మంగళవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
పాస్పోర్ట్ సేవలను మరింత వేగవంతం చేయడానికి రాష్ట్రంలోని ఐదు పాస్పోర్ట్ కేంద్రాలు బేగంపేట్, ఎంజీబీఎస్, రాయదుర్గం, కరీంనగర్, నిజామాబాద్లో నాలుగు వేల సాధారణ స్లాట్స్ విడుదల చేస్తున్నామని తెలిపారు. అందులో 3,100 స్లాట్స్ హైదరాబాద్ పరిధిలోని పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో, 900 కరీంనగర్, నిజామాబాద్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన స్లాట్స్ను ఇప్పటినుంచే బుక్ చేసుకోవచ్చని సూచించారు. ఇప్పటికే స్లాట్ బుక్ అయిన వారు సైతం రీషెడ్యూల్తో మేళాను వినియోగించుకోవచ్చని వివరించారు.
కరీంనగర్లో పెరిగిన డిమాండ్ దృష్ట్యా నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు మే 4 నుంచి ప్రస్తుతమున్న 220 అపాయింట్మెంట్స్ను 400కు పెంచుతున్నామని స్నేహజ చెప్పారు. అందులో ప్రస్తుతమున్న 160 సాధారణ స్లాట్స్ను 310కి, తత్కాల్ స్లాట్స్ను 60కి, పీసీసీ స్లాట్స్ను 30కి పెంచినట్టు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున 4,500 దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నట్టు చెప్పారు. సాధారణ అపాయింట్మెంట్స్ కోసం హైదరాబాద్లో 8-10 రోజులు, కరీంగనర్, నిజామాబాద్లో 8-12 రోజులు వేచి చూడాల్సి వస్తున్నది.
పాస్పోర్ట్ మేళాతో అపాయింట్మెంట్ కోసం వేచి చూసే సమయం 5-7 రోజులు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. సాధారణంగా పాస్పోర్ట్ను 4-5 రోజుల్లో, తత్కాల్ అయితే 1-2రోజుల్లో, కొన్ని సందర్భాల్లో అత్యంత ఎమర్జెన్సీ ఉంటే ఒకేరోజులో జారీచేస్తున్నామని తెలిపారు. పాస్పోర్ట్ను పోస్ట్ ద్వారానే పంపుతున్నామని, ఆఫీస్లో అందించడం లేదని చెప్పారు.
పాసుపోర్ట్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ప్రతి గురువారం పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ను సంప్రదించవచ్చు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య నేరుగా ఆర్పీవో కార్యాలయాన్ని సందర్శించవచ్చు. rpo.hyderabad@cpo.gov.inకు మెయిల్ చేయొచ్చు. వాట్సాప్ నంబర్ 8121401532 ద్వారా కూడా సంప్రదించవచ్చు. పాస్పోర్టు స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. పాస్పోర్ట్ సేవల కోసం 040-27715333, 27715115, 27806657 నంబర్లను సంప్రదించాలని స్నేహజ తెలిపారు. కొత్తగా పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ‘ఈ’-పాస్పోర్టులు జారీ అవుతున్నాయి.
ఇప్పటికే పాస్పోర్ట్ ఉన్నవారు దాని గడువు ముగిశాక ‘ఈ-పాస్పోర్ట్’కు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి పాస్పోర్ట్లో ఈ-చిప్ టెక్నాలజీని చేర్చడం ద్వారా అది భద్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ‘పాస్పోర్ట్ పోతే తొలుత మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం మీసేవ నుంచి సంబంధిత వ్యక్తి వివరాలు స్థానిక పోలీస్స్టేషన్కు చేరుతాయి. పోలీసులు ఆ వివరాలను పరిశీలించి అప్రూవల్ ఇస్తారు.