హైదరాబాద్, సిటీబ్యూరో, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ): ప్రజలను ఆందోళనకు గురిచేసే విధంగా రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ విధించనున్నారంటూ నకిలీ జీవోను సృష్టించి, దానిని సోషల్మీడియాలో పోస్ట్చేసిన ఒక చార్టెడ్ అకౌంటెంట్ను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి తెలంగాణలో లాక్డౌన్ ఉంటుందంటూ సోషల్మీడియాలో నకిలీ జీవో సర్క్యులేట్ అయ్యింది. దీనిపై సీఎస్ సోమేశ్కుమార్ స్పందించి అది నకిలీ జీవో అని వివరణ ఇచ్చారు. ఆ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి మాదాపూర్కు చెందిన శ్రీప తి సంజీవ్కుమార్ అని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం తెలిపారు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి బంజారాహిల్స్లోని కార్వి అండ్ కంపెనీలో చార్టెర్డ్ అకౌంటెంట్. గతంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పుడు విడుదల చేసిన జీవోను డౌన్లోడ్ చేసుకొని నకిలీ జీవోను సృష్టిండు. నిందితుడు శ్రీపతి సంజీవ్కుమార్ను సోమవారం సీసీఎస్, పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన అపరేషన్లో పట్టుకున్నారు. అతడి నుంచి ల్యాప్టాప్, ఒక ఐ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. స్నేహితులను ఏప్రిల్ ఫూల్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ జీవోను రూపొందించినట్టు విచారణలో శ్రీపతి వెల్లడించాడు.
వాట్సాప్ అడ్మిన్లకు హెచ్చరిక
నకిలీ వార్తలు, నకిలీ జీవోలను ఫార్వర్డ్ చేసే వాట్సాప్ అడ్మిన్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. గ్రూప్లో పోస్ట్ అయ్యే సమాచారానికి అడ్మిన్లదే బాధ్యత అని చెప్పారు. ఏదైనా నకిలీ వార్తలు మీ దృష్టికి వస్తే వాటిని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత గ్రూప్ అడ్మిన్లదేనని అన్నారు. ఆ సమాచారాన్ని ఫార్వర్డ్ చేసే ముందు ప్రతిఒక్కరు, అందులో నిజా నిజాలు తెలుసుకోవాలని సీపీ సూచించారు.