దుండిగల్, ఫిబ్రవరి 3: కేంద్రంలోని భూ ఉపరితల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్) ఆధీనంలోని ‘భారత జాతీయ మహా సముద్ర సమాచార సేవా కేంద్రం’ (ఇన్కాయిస్) 24వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు గురువారం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, ప్రగతినగర్లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా ‘ఓషియన్ ప్రిడిక్షన్ అండ్ ది యూఎన్ దశాబ్ది అవకాశం’ అనే పేరుతో ‘ఇన్కాయిస్ ఫౌండేషన్ డే లెక్షర్’ను మెర్కేటర్ డైరెక్టర్ జనరల్ డా.పియరీ బహురెల్ ప్రారంభించి ప్రసంగించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూ ఉపరితల మంత్రిత్వ శాఖ సెక్రెటరీ, ఇన్కాయిస్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ డా.రవిచంద్రన్ మాట్లాడుతూ సముద్ర గర్భంలో చోటు చేసుకునే మార్పులను ఇన్కాయిస్ ఎప్పటికప్పుడు గుర్తించి హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. తీర ప్రాంత ప్రజలకు, మత్స్యకారులకు ఇన్కాయిస్ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని తెలిపారు. కార్యక్రమంలో ఇన్కాయిస్ డైరెక్టర్ డా.టి.శ్రీనివాస కుమార్, మాజీ డైరెక్టర్ డా.కే.రాధాకృష్ణన్, డా.శేలేష్ నాయక్, డా.సతీష్ షెనోయితో పాటు ప్రపంచ ్యప్తంగా ఉన్న సముద్ర శాస్త్ర నిపుణులు పాల్గొన్నారు.