సిటీబ్యూరో, జనవరి 20(నమస్తే తెలంగాణ): దేశంలోని పలు నగరాలతో పోల్చి చూస్తే అభివృద్ధిలో హైదరాబాద్ నగరం అగ్రగామిగా నిలుస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న మహా నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. పంజాగుట్టలో రూ.17 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ పరిధిలో నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు గురువారం ప్రారంభించారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు గాను కొత్తగా అండర్ పాస్లు, ఫ్లై ఓవర్లు, ఫుట్ పాత్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు కోట్లాది రూపాయల వ్యయంతో కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. అనేక రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులను చేపట్టడం ద్వారా పలు ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యను పరిషరిస్తున్నట్లు మంత్రి చెప్పారు. వీటితో పాటు మౌలిక వసతులను కల్పించే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవతో దేశంలోని ఇతర నగరాల కన్నా హైదరాబాద్ నగరం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి తలసాని అన్నారు.
పంజాగుట్ట గ్రేవ్ యార్డ్కు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జి వలన శ్మశాన వాటికకు వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని మంత్రి చెప్పారు. పాత గేట్ నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు వెడల్పు చేసినందున నాగార్జున సరిల్ నుంచి కేబీఅర్ పార్ జంక్షన్కు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సాఫీగా ప్రయాణం కొనసాగుతుందని వివరించారు. ఇక్కడ చేపట్టిన అభివృద్ధిలో మొత్తం రోడ్డు విస్తీర్ణం 140 మీటర్లు కాగా, అందులో అప్రోచ్ రిటర్నింగ్ వాల్ 57 మీటర్లు, 9.6 మీటర్ల ఫె్లై ఓవర్, మొత్తం 46 స్టీల్ గ్రిడర్స్ ఏర్పాటు చేసి పనులను పూర్తి చేసినట్లు మంత్రి తలసాని వివరించారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, జీహెచ్ఎంసీ సీఈ దేవానంద్, ఎస్ఈ రవీందర్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.