ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్న నిర్మాణాలు
ఇప్పటికే 28 చోట్ల భారీ వంతెనలు
త్వరలోమరో 24 ఫ్లై ఓవర్లు
సిటీబ్యూరో, డిసెంబర్ 27 : నగర మౌలిక వసతుల అభివృద్ధిపై ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నది. నాలుగు ఫ్లై ఓవర్లు కట్టి నగరాన్ని ప్రపంచపటంలో పెట్టామని డబ్బాలు కొట్టుకున్న సమైక్య పాలకులకు భిన్నంగా వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్ఆర్డీపీ)ని అందుబాటులోకి తెచ్చి మొక్కవోని దీక్షతో పరుగులు పెట్టిస్తున్నది. శరవేగంగా ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణ పనులను కొనసాగిస్తున్నది. ఇప్పటికే నగరం నలుమూలల అనేక నిర్మాణాలు పూర్తికాగా.. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. ఈ క్రమంలో మొదటి దశలో రూ.8092 కోట్లతో 47 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, కేబుల్ బ్రిడ్జిలకు శ్రీకారం చుట్టి 23 చోట్ల అందుబాటులోకి తెచ్చింది. మరో 24 చోట్ల యుద్ధప్రాతిపదికన పనులు సాగుతున్నాయి.
ఎస్ఆర్డీపీ టీమ్కు అభినందనలు
మిధాని-ఒవైసీ జంక్షన్ల మధ్య 1.365 కిలో మీటర్ల పొడవుతో నిర్మించిన ఫ్లై ఓవర్ను హైదరాబాద్ నగర ప్రజలకు అంకితం చేయడం చాలా ఆనందంగా ఉంది.ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ రూ.80 కోట్లతో నిర్మాణం చేపట్టింది.సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో ఇది భాగం. ైప్లె ఓవర్ నిర్మాణం పనులు విజయవంతంగా పూర్తి చేసిన ఎస్ఆర్డీపీ బృందానికి అభినందనలు. – ట్విట్టర్లో మంత్రి కేటీఆర్
ట్రాఫిక్ చిక్కులు.. జంక్షన్ల జామ్లు.. గంటల తరబడి ప్రయాణాలు.. గ్రేటర్లో ఇవన్నీ పాత మాటలు. ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాక ప్రయాణంలో గంటలు.. నిమిషాలు అయ్యాయి. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిమిషాల్లోనే గమ్యానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పద్మవ్యూహాలను చీల్చుకుంటూ సాకారమవుతున్న వ్యూహాత్మక దారులతో నగరవాసులు ఊరట పొందుతున్నారు. తెలంగాణ సర్కారు ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మొక్కవోని దీక్షతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి.)ను పరుగులు తీయిస్తుంది. ఇప్పటికే నగరం నలుమూలల అనేక నిర్మాణాలు పూర్తవగా… మరికొన్ని నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ఎస్ఆర్డీపీ పథకం మొదటి దశలో రూ. 8092 కోట్లతో 47 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, కేబుల్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు, ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో 23 చోట్ల అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోయింది. ప్రయాణం సాఫీగా జరగడంతో వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతుంది. ఈ నేపథ్యంలోనే పురోగతిలో ఉన్న 24 చోట్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి కల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి మొదటిదశను విజయవంతం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
న్యూ ఇయర్ కానుక
జనవరి 1న నగరంలో అతిపెద్ద రెండో ఫ్లైఓవర్ ప్రారంభం
లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
దాదాపు లక్షల మంది వాహనదారులకు భారీ ఉపశమనం
వాహనదారులకు న్యూ ఇయర్ కానుకగా అందనుంది. సెవెన్టూంబ్స్, ఫిలింనగర్ మెయిన్రోడ్డు, ఓయూ కాలనీ, విస్పర్వ్యాలీ టీ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులను శాశ్వతంగా తొలగిపోనుంది. గెలాక్సీ థియేటర్ నుంచి మల్కంచెరువు వరకు రూ. 333.55కోట్లతో 2.71కిలోమీటర్ల మేర రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్గా నిర్మాణం పూర్తి చేసుకున్న షేక్పేట ఫ్లై ఓవర్ జనవరి 1న లాంఛనంగా మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ ఫ్లై ఓవర్తో నానల్నగర్ నుంచి ఖాజాగూడ, అక్కడి నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు దాదాపు 11 కిలోమీటర్ల మేర సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యం కానుంది. కోర్సిటీ నుంచి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ల వైపు రాకపోకలు సాగించే వారికి భారీ ఉపశమనం లభించనుంది. ఇన్నర్ రింగు రోడ్డు (రేతిబౌలి) నుంచి ఔటర్ రింగు రోడ్డు (గచ్చిబౌలి) వరకు లక్డీకాపూల్, మెహిదీపట్నం, టౌలిచౌకీ, గచ్చిబౌలి మార్గాల్లో ప్రయాణించే దాదాపు 4 లక్షల వాహనదారులకు ఊరట కలగనుంది. బయోడైవర్శిటీ జంక్షన్-జేఎన్టీయూ జంక్షన్ మార్గానికి అనుసంధానంగానూ ఉన్న ఈ ఫ్లై ఓవర్తో దాదాపు 17 కి.మీల మేర (లక్డీకాపూల్-జేఎన్టీయూ జంక్షన్) సాఫీ ప్రయాణం సాధ్యమని ఈ ప్రాజెక్టు పనులు పర్యవేక్షించిన ఎస్ఈ వెంకట రమణ తెలిపారు.
నిర్మాణం పూర్తయిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు
ఎస్ఆర్డీపీ కింద చేపట్టి పూర్తయిన ప్రాజెక్టులు జీహెచ్ఎంసీ పరిధిలో 19 ఉన్నాయి. వీటి నిర్మాణానికి రూ.1094 కోట్లు వెచ్చించారు.
హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల సంస్థల పరిధిలో 3 ప్రాజెక్టులు చేపట్టగా, వాటి కోసం మొత్తం రూ.854 కోట్లు వెచ్చించారు.
నిర్మాణంలో ఉన్న ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో రూ.4466 కోట్లతో 22 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
జాతీయ రహదారుల సంస్థ రూ.1678 కోట్లతో 3 ప్రాజెక్టులను చేపడుతోంది.
ఎస్ఆర్డీపీ మొదటి దశలో భాగంగా రూ.8092 కోట్లను ప్రాజెక్టుల నిర్మాణం కోసం వెచ్చిస్తున్నారు.
తూర్పు-పడమరలను కలుపుతూ.. దక్షిణ ప్రాంతంలో 7 ప్రాజెక్టులు
నేడు ఒవైసీ-మిధాని జంక్షన్ ైప్లె ఓవర్ ప్రారంభం
రూ. 80 కోట్లతో 1.36 కిలోమీటర్ల మేర నిర్మాణం
పాతనగరానికి తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
సిటీబ్యూరో, డిసెంబర్ 27: ఎస్.ఆర్.డి.పి పథకం మొదటి దశలో ఆరాంఘర్ నుంచి ఎల్.బి నగర్ వరకు సులువుగా ప్రయాణించేందుకు మొత్తం 7 ప్రాజెక్టులు చేపట్టారు. తూర్పు – పడమరలను కలుపుతూ దక్షిణ ప్రాంతం (పాతబస్తీ)లోనే ఈ ఏడు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అందులో 5 ఫ్లై ఓవర్లలో మంగళవారం ఓవైసీ ఫ్లై ఓవర్ నిర్మాణం అందుబాటులోకి రానుంది.. ఒకటి అండర్ పాస్ ఉప్పుగూడ అందుబాటులోకి వచ్చింది. శాస్త్రీపురం వద్ద అర్వోబి పనులతో నల్గొండ ఓవైసీ కారిడార్ ఫ్లై ఓవర్, చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్ పొడిగింపు, బహదూర్ పుర , ఆరాంఘర్ నుంచి జూ పార్ కారిడార్ ఫ్లైఓవర్ ఫలక్నుమ పనులను వచ్చే ఏడాది మార్చి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేనున్నట్లు సీఈ దేవానంద్ తెలిపారు.
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా..
కంచన్బాగ్లోని ఫిసల్బండ డీఆర్డీఎల్ వైపు నుంచి ఓవైసీ జంక్షన్ మీదుగా బైరామల్గూడ వైపు ప్రయాణం సాఫీగా సాగనుంది. రూ. 63 కోట్ల అంచనా వ్యయంతో 1.36కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఫ్లైఓవర్ను మంగళవారం ఉదయం 10. 30 గంటలకు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఫె్లై ఓవర్ను ప్రీకాస్ట్ టెక్నాలజీతో నిర్మించారు. నగరంలో దక్షిణ ప్రాంతంలో మొట్టమొదటి బ్రిడ్జి నిర్మాణ వ్యయం రూ. 63 కోట్లు కాగా భూసేకరణ కింద నష్టపరిహారంగా మరో రూ.17 కోట్లు వెచ్చించారు. దీంతో ఈ ప్రాజెక్టు మొత్తం రూ.80 కోట్ల ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మూడు లైన్లతో ఒకే మార్గంతో నిర్మాణం చేపట్టారు.