Uppal Tickets | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోమారు నిరాశే ఎదురైంది. తాము ఎంతగానో అభిమానించే ఐపీఎల్ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడాలనుకున్న ఫ్యాన్స్ ఆశలు అడిఆశలయ్యాయి. ఈ నెల 25వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో పాటు మే 2న లక్నో సూపర్జెయింట్స్తో జరిగే మ్యాచ్ల కోసం పేటీఎమ్లో శుక్రవారం టికెట్లు అందుబాటులో ఉంచారు.
అయితే అలా వెబ్సైట్ ఓపెన్ అయిందో లేదో టికెట్లు చూస్తుండగానే మాయం అయిపోయాయి. తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసేందుకు అప్పటి వరకు ఓపికగా ఉన్న ఫ్యాన్స్కు ఆఖరికి నిరాశే ఎదురైంది. ఓవైపు ఒక్కో స్టాండ్ సోల్డ్ఔట్ అంటూ మెస్సెజ్లు రాగా, చివరికి నిమిషాల వ్యవధిలో వేలాది టికెట్లు గాయబ్ అయ్యాయి. దీనిపై అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.