సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : ఓఆర్ఆర్ ఫేజ్-2 పనుల్లో వేగం పెంచాలని జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు. వచ్చే నెలలో మొదటి ప్రాధాన్యతగా నిర్ణయించిన ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే లక్ష్యంతో పనులు జరగాలని అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆయన ఆదేశించారు. గురువారం కీసర, ఘట్ కేసర్ మండలాల్లోని కొకకోలా కాలనీ, రామకృష్ణాపురం, అయ్యప్ప కాలనీ, అన్నోజిగూడ , దరిగూడ, తదితర ప్రాంతాల్లో ఓఆర్ఆర్ ఫేజ్ – 2 పనుల్లో భాగమైన ప్యాకేజ్ – 1లో చేపట్టిన రిజర్వాయర్ల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. దరిగూడలో పైపులైన్ విస్తరణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. ప్యాకేజ్ -1లో మొదటి ప్రాధాన్యతగా నిర్ణయించిన 89 కాలనీలకు ఏప్రిల్ రెండో వారంలో నీటిని సరఫరా చేయాలని, ఈ దిశగా 171 కిలోమీటర్ల పైపులైన్ పనులు వేగవంతంగా చేయాలని ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. అలాగే, రిజర్వాయర్ల నిర్మాణంలో ప్రతి దశను పూర్తి చేయడానికి నిర్దేశిత తేదీలను లక్ష్యంగా పెట్టుకోవాలని, ఆ తేదీ నాటికి ఆ దశను పూర్తి చేయాలని సూచించారు. ఈ మొత్తం ప్ర ణాళికను సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని సూచించారు. నిర్మాణ దశలో ఉన్న రిజర్వాయర్ల వద్ద తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఓఆర్ఆర్ ఫేజ్ – 2 వివరాలు
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు మంచినీటిని అందించేందుకు రూ.1,200 కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్ – 2 పనులను జలమండలి చేపట్టింది. ప్యాకేజ్ -1లో రూ.613 కోట్లు, ప్యాకేజ్ -2 కింద రూ.587 కోట్లతో జలమండలి ఈ పనులను చేపట్టింది.
ఓఆర్ఆర్ ఫేజ్ – 2లోని ప్యాకేజ్ – 1 వివరాలు
ప్యాకేజ్ -1లో మొత్తం 65.5 ఎంఎల్ సామర్థ్యం కలిగిన 34 రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్నది. 1571 కిలోమీటర్ల కొత్త పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే కొత్తగా 87,293 నివాసాలకు నల్లా కనెక్షన్ అందుతుంది. ఘట్కేసర్, కీసర, సరూర్నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్నగర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో ప్యాకేజ్-1 పనులు జరుగుతున్నాయి. ఇందులో మొదటి ప్రాధాన్యతగా 89 కాలనీలకు ఏప్రిల్ రెండో వారంలో నీటిని సరఫరా చేయాలని జలమండలి నిర్ణయించింది. కార్యక్రమంలో జలమండలి టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, సీజీఎం అమరేందర్ రెడ్డి, జీఎంలు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.