కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 21: దేశ సేవయే.. దేవుని సేవ అని.. దేశం కోసం ప్రాణాలొదిలిన వీర సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం చాలా గొప్పగా ఉందని కేంద్ర టూరిజం, కల్చర్ అండ్ డెవలప్మెంట్ నార్త్ ఎస్ట్రన్ రీజియన్ శాఖా మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. కూకట్పల్లిలోని పీఎన్ఎం పాఠశాలలో భారత్ వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన సైనిక్ వంద న్ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, అమరవీరుల కుటుంబాలతో పాటు కష్టాల్లో ఉన్న పేదవారికి ఆసరాగా నిలవడం మానవ జన్మకు స్వార్థకత అన్నారు. భారత వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ వేదికపై 55 మంది సైనిక కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున, సైనిక నిధికి రూ.2 లక్షలు అందించడంతో పాటు 50 మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భారత వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీహెచ్ వి.సుబ్బారావు, పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి, మెడ్ప్లస్ అధినేత భాస్కర్రెడ్డి, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ దుర్గాప్రసాద్తో పాటు విజయ్ కుమార్, శ్యామ్సుందర్ గౌడ్, నరేంద్రకృష్ణ, అనిల్ కుమా ర్, అనిల్, సృజనప్రభ, రాజేశ్వర్రావు పాల్గొన్నారు.