బన్సీలాల్పేట్, మార్చి 4: చర్మ వ్యాధిగ్రస్తులకు గాంధీలో అత్యుత్తమైన చికిత్స అందుతున్నది. నిపుణులైన వైద్యులు రోగులకు సకల సేవలు అందిస్తున్నారు. వైద్యశాలలోని ఔట్పేషంట్ విభాగంలోని రెండవ అంతస్తులో రూమ్ నంబర్ 74లో చర్మ, లైంగిక, కుష్ఠువ్యాధుల (డీవీఎల్) చికిత్సా విభాగం కొనసాగుతున్నది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు వచ్చే రోగులకు పదకొండు మంది ప్రొఫెసర్లు, ఆరుగురు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, 26 మంది పీజీ వైద్యవిద్యార్థులు వైద్య సేవలు అందిస్తున్నారు.
ఆధునిక ఆపరేషన్ థియేటర్లు..
ఇతర సర్కారు దవాఖానల్లో ఎక్కడా లేనటువంటి వైద్య పరికరాలను ప్రభుత్వం తొలి ప్రాధాన్యం కింద గాంధీలో ఏర్పాటు చేసింది. ఇందులో మేజర్, మైనర్ పరికరాలతో కలిపి ప్రతిరోజు ఇరవైకి పైగా కెమికల్, కాస్మెటాలజీ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు.
తొలి లేజర్ చికిత్సా కేంద్రం..
రాష్ట్రంలోనే మొట్టమొదటి లేజర్ చికిత్సా విధానాన్ని గాంధీలో ఏర్పాటు చేశారు. ఇందులో సీఓ2లేజర్, డైయోడ్, ఎన్డీ యోగ్ లాంటి అత్యాధునిక యంత్రాలతో చర్మంపై ఉండే నల్లమచ్చలు, మొటిమలు, స్కార్, అవాంఛిత రోమాల తొలగింపునకు, చర్మం తెల్లగా మారేందుకు లేజర్ చికిత్సను చేస్తున్నారు. ఇతర ప్రైవేట్ వైద్యశాలల్లో వేలాది రూపాయలు ఖర్చయ్యే వైద్యాన్ని ఇక్కడ పూర్తి ఉచితంగా అందిస్తున్నారు.
ఏకైక పిడియాట్రిక్ డెర్మటాలజీ శిక్షణా కేంద్రం..
దేశంలోనే తొలిసారిగా ఓపీడీ విభాగంలో పిడియాట్రిక్ డెర్మటాలజీ శిక్షణా కేంద్రాన్ని 2019లో ఐఏడీవీఎల్ ద్వారా అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేశారు. డీవీఎల్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ జి.నర్సింహారావు, డాక్టర్ సి.సుధారాణి, ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ కె. భూమేశ్ కుమార్ పర్యవేక్షలో కొనసాగుతున్న ఈ కేంద్రంలో ప్రతి సంవత్సరం ఇద్దరు ఎండీడీవీఎల్ (డెర్మటాలజీ) విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఈ సంవత్సరం శిక్షణ పొందుతున్న వారిలో ఒకరిది రాజస్థాన్ కాగా.. మరొకరిది తెలంగాణ.
చర్మ వ్యాధులపై నిర్లక్ష్యం తగదు..
చిన్నారుల్లో వచ్చే చర్మ వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నారులను అధికంగా గజ్జి, తామర ఇబ్బంది పెడుతుంది. చర్మ వ్యాధిగ్రస్తులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రాథమిక దశలోనే నివారించుకుంటే మంచిది. గాంధీలో అత్యద్భుతమై చికిత్స పూర్తిగా ఉచితం.
– డాక్టర్ భూమేశ్ కుమార్, ప్రోగ్రాం డైరెక్టర్, పిడియాట్రిక్ డెర్మటాలజీ శిక్షణా కేంద్రం
అత్యుత్తమమైన వైద్యం..
డీవీఎల్ విభాగంలో చర్మ, లైంగిక, కుష్ఠు వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య చికిత్సలను అందిస్తున్నాం. నైపుణ్యం, అనుభవం కలిగిన వైద్య బృందం ఈ విభాగం సొంతం. ఇతర వైద్యశాలల్లో లక్షలు ఖర్చయ్యే వైద్యం ఇక్కడ పూర్తిగా ఉచితం. శిశువులు, చిన్నారుల చర్మ వ్యాధుల చికిత్స కోసం ప్రత్యేక పిడియాట్రిక్ డెర్మటాలజీ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశం. రోజుకు ఇరవైకి పైగా రోగులకు శస్త్ర చికిత్సలు అందిస్తున్నాం.
– డాక్టర్ జి.నర్సింహారావు, డీవీఎల్ విభాగం హెచ్ఓడీ