బన్సీలాల్పేట్, మార్చి 3: దేశ జనాభాలో రెండు శాతం చిన్న పిల్లలు, యా భై శాతం వృద్ధులలో వినికిడి సమస్యలు తలెత్తుతున్నాయని, ఆదిలోనే చిన్నారులలో వినికిడి శక్తి సమస్యలను గుర్తిస్తే చికిత్స అందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గాంధీ దవాఖా న ఈఎన్టీ విభాగం హెచ్వోడీ డాక్టర్ ఏ.శోభన్బాబు అన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) విభాగం సెమినార్ హాలులో గురువా రం 14 మందికి వినికిడి పరికరాలను ఉచితంగా అందజేశారు.
ఇందుకు ముఖ్య అతిథిగా హాజరైన గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రా జారావు మాట్లాడుతూ, శబ్ద కాలుష్యం కారణంగా, వయ స్సు పైబడిన కారణంగా వచ్చే వినికిడి సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. తమ పిల్లలకు తలెత్తిన వినికిడి సమస్యలతో అల్లాడుతున్న ఎందరో తల్లుల ఆవేదనను అర్థం చేసుకుని, వారికి చేయూతనిస్తున్న ఈఎన్టీ విభాగం వైద్యులు, సిబ్బంది, ఎంవీఎఫ్, అలీం కో సంస్థల సేవలను ఆయన అభినందించారు. వినికిడి సమస్య చికిత్స కోసం త్వరలోనే గాంధీలో ‘కాక్లియర్ ఇంప్లాంట్’ ఆపరేషన్ సదుపాయాన్ని ప్రారంభించనున్నామని వెల్లడించారు. తల్లి గర్భంలో ఉండగానే శిశువు వినికిడి శక్తిని గుర్తించగలిగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉన్నదని అన్నారు.
అ నంతరం, వినికిడి సమస్యలపై అవగాహన కల్పించేందు కు ఎంవీఎఫ్ సంస్థ రూపొందించిన పోస్టర్లను వారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జి.నర్సింహారావు నేత, వైస్ ప్రిన్సిపాల్ డా. కృష్ణమోహన్, ప్రొఫెసర్లు డా.రాథోడ్, డాక్టర్లు జార్జి, రం గనాథ్, ఆర్ఎంఓ జయకృష్ణ, ఆడియాలజిస్టులు కె.సాయికిరణ్, రంగనాథన్, జయచంద్రన్, దివ్యప్రకాశ్, అలీం కో ప్రతినిధి ప్రశాంత్, మీనాక్షి వెంకటరామన్ ఫౌండేషన్, మేనేజింగ్ ట్రస్టీ జీవీ సేతురామన్, డైరెక్టర్ రంగనాథన్, ఈఎన్టీ వైద్యులు, పీజీలు, విద్యార్థులు పాల్గొన్నారు.