మేడ్చల్, మార్చి 3(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఘనంగా సంబురాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి గురువారం టెలీ కాన్ఫరెన్స్లో మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో మహిళ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 6న ప్రతి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీలు కట్టడం, మహిళా పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు సన్మానాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
7న కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళ, బీడి కార్మికుల పింఛన్ల పొందుతున్న లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి స్వీట్లు, గాజుల, చీరల పంపిణీ కార్యక్రమాలకు చేపట్టనున్నట్లు మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. 8న జిల్లాలోని ఐదు నియోజకవర్గ కేంద్రాలలో మహిళల సమావేశం నిర్వహించి ఉత్సవ సంబురాలను జరపనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.