బడంగ్పేట, మార్చి3 : డ్రగ్స్ వాడిన వారిపై ఉక్కు పాదం మోపాలని సీఎం కేసీఆర్ పోలీసులకు కఠినమైన ఆదేశాలు జారీచేశారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చదువులో తెలంగాణ విద్యార్థి ప్రపంచంతో పోటీ పడాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ఇంగ్లిష్ విద్యను అందిస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను పురస్కరించుకుని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన డ్రగ్స్, షీటీమ్స్పై అవగాహన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్, రంగారెడ్డి జిల్లా జెడ్సీ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితా హరినాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి మంత్రి విద్యార్థులతో ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రి సబిత మాట్లాడుతూ హైదరాబాద్కు బెస్టు సిటీగా, సేఫ్ సిటీగా పేరు ప్రతిష్టలు వచ్చాయని, అలాంటి నగరంలో డ్రగ్స్ లాంటి దురలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు కష్ట పడి చదువుకొని బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ మాట్లాడుతూ యువత దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్కు అలవాటు పడితే.. భవిష్యత్ పాడవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, డీసీపీ షీ టీమ్స్ సలీమా, ఏసీపీ హరినాథ్, సతీశ్, లత, రామ సుబ్రమణ్యం, సావిత్రి, అర్చన, శివ, తదితరులు ఉన్నారు.