సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ రూ. 29.10 కోట్ల వ్యయంతో చేపట్టిన తుకారాం రైల్వే అండర్ బ్రిడ్జిని శుక్రవారం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహానగరం నలువైపులా విస్తరిస్తున్న నగరీకరణ వల్ల పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. వ్యూహాత్మక రోడ్ డెవలప్మెంట్ పథకం ద్వారా చేపట్టిన తుకారం రైల్వే అండర్ బ్రిడ్జి శుక్రవారం అందుబాటులోకి రానున్నది.
అండర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటుగా అప్రోచ్ రోడ్డు డ్రైనేజీ పనులకు రూ.29.10 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ రైల్వే శాఖ నిధులతో చేపట్టారు. మొత్తం 375 మీటర్ల పొడవు, 40 మీటర్ల బాక్స్ డ్రైనేజీ, 245 మీటర్ల అప్రోచ్ రోడ్డు అందులో 86 మీటర్ల ర్యాంపు రోడ్డు, మెట్టుగూడ వైపు మరో 159 మీటర్ల ర్యాంపు మారేడుపల్లి వైపు నిర్మాణం చేపట్టారు. 5.50 మీటర్ల వెడల్పు గల అప్రోచ్ రోడ్డు క్యారేజ్ మార్గం 150 వెడల్పు బాక్స్ పోర్షన్, మరో 150 మీటర్ల వెడల్పు అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేశారు. లాలాగూడ రైల్వే స్టేషన్కు రైళ్ల రాకపోకలు వల్ల తరుచుగా మూసి ఉండే రైల్వే లెవెల్ క్రాసింగ్ వలన ఇబ్బందిని తొలగించేందుకు అండర్ బ్రిడ్జి వలన ఉపశమనం కలుగుతుంది.
మహా ఊరట
ఆర్యూబీతో మలాజిగిరి, మారేడ్ పల్లి, తార్నాక, మెట్టుగూడ, లాలాపేట్ సికింద్రాబాద్ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. అంతే కాకుండా మౌలాలి, మలాజిగిరి, తార్నాక నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లేందుకు ఆ ప్రాంత ప్రజలకు మంచి కనెక్టివిటీగా ఉంటుంది. రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ఎల్సీ 256/ఈ లెవల్ క్రాసింగ్ వద్ద తుకారాం గేట్ వద్ద మలాజిగిరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య నిర్మాణ పనులు చేపట్టారు.