మేడ్చల్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను పచ్చదనంలో రాష్ట్రంలోనే నంబర్వన్ స్థానంలో నిలపాలని ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. మేడ్చల్ కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన హరితహారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆమె మాట్లాడుతూ నగరానికి చేరువులో ఉన్న ఈ జిల్లాలో వీలైనంత ఎక్కువ మొక్కలు నాటాలని అధికారులు ఆదేశించారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షణ బాధ్యతలను అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకోవాలని సూచించారు.
హరితహారంను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. సమస్యలు, ఉంటే తన దృష్టికి తీసుకరావాలని, 15 రోజులలో జిల్లాలో పర్యటిస్తానని పేర్కొన్నారు. కలెక్టర్ హరీశ్, అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్రావు ప్రతినిత్యం మానిటరింగ్ చేస్తూ, క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అనుకున్న లక్ష్యానికి చేరుకుంటామని చెప్పారు. జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో ఎకరం విస్తీర్ణంలో శాండల్ వుడ్ పార్క్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జూన్లో హరితహారం..
జూన్లో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి ప్రణాళికలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. జిల్లాలో మరిన్ని ఆక్సిజన్ పార్క్ల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందిస్తామని చెప్పారు. గ్రామాలు, మున్సిపాలిటీలను పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకుంటే హరితహారం కార్యక్రమాలు విజయవంతం అవుతాయని, ఆ దిశగా కసరత్తు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆశయాలకు అనుగుణంగా పని చేసి జిల్లాను రాష్టంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుపుతామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, అటవీశాఖ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.