సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాబోయే వర్షాకాలంలో నగరంతో పాటు చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ గ్రోత్ కారిడార్లో వర్షాకాలంలో సంభవించే విపత్తుల నివారణ చర్యలపై ముందస్తు ప్రణాళికలో భాగంగా ఎస్ఎన్డీపీ విభాగం అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యూహాత్మక నాలా అభివృద్ధి పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. రూ.858 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 60 ఎస్ఎన్డీపీ పనుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 37 పనులు 90 శాతం పూర్తి అయ్యాయన్నారు. మిగిలిన పనుల టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నాలాల ద్వారా వరద ప్రవాహం నివారించేందుకు చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల్లోనూ పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎన్డీపీలో లేని నాలా పనులను గుర్తించి వరద నివారణకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నగరంలోని చెరువులు, కుంటల్లోని వరద ప్రవాహంపై అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.
నగరంలోని చెరువులను పరిశీలించి బలహీనంగా ఉన్న కట్టలు, స్లూయిస్లను గుర్తించి వర్షాకాలం లోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాలం వరకు చెరువుల్లో అధిక నీరు ఉంటే దిగువ ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి, ఈఎన్సీ జియావుద్దీన్, ఎస్ఎన్డీపీ చీఫ్ ఇంజినీర్లు కిషన్, వసంత దేవానంద్, ఎస్ఈలు, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.