సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. గతేడాది అనుభవాలు పునరావృతం కాకుండా వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించి నాలాల అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే మొదటి దశలో రూ. 858 కోట్ల అంచనా వ్యయంతో వరద ప్రభావం ఎకువగా ఉన్న ప్రాంతాల్లో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టి పూర్తి చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధితో పాటు చుట్టుపకల ఉన్న మున్సిపాలిటీలలో మొత్తం 60పనులకు గాను 32 పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 37 పనులు, చుట్టూ ఉన్న మున్సిపాలిటీ లలో మరో 23 పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. వచ్చే వర్షాకాలం వరకు పూర్తి చేయాలనే సంకల్పంతో నాలా అభివృద్ధి, విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు జోనల్ స్థాయిలో సీనియర్ ఇంజినీరింగ్ అధికారులకు బాధ్యతలు అప్పజెప్పారు. పనుల్లో భాగంగా సికింద్రాబాద్ జోన్లో 8, కూకట్పల్లి జోన్లో 3, ఎల్బి నగర్ జోన్లో 10, చార్మినార్ జోన్లో 7, ఖైరతాబాద్ జోన్లో 7, శేరిలింగంపల్లి జోన్లో 2 పనులలో 26 పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మిగతా 11పనులలో ఈ నెలలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి మార్చిలో పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయంలో రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటి కప్పుడు సమీక్షిస్తూ పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.