సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘మేం పాటించడంతో పాటు మా తల్లిదండ్రులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తామని’ వీ కాప్ సభ్యులు శపథం చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) సంయుక్తాధ్వర్యంలో ఆదివారం ట్యాంక్బండ్పై ‘వీ కాప్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ చిన్న పిల్లలే పోలీసులుగా వ్యవహరిస్తూ.. వారి కుటుంబ సభ్యుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన తీసుకురావాలన్నదే ‘వీ కాప్’ ఉద్దేశమని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 45 స్కూళ్లల్లోని సుమారు 10 వేల మంది విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. భవిష్యత్లో అన్ని స్కూళ్లకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు సీపీ చౌహాన్, ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్.చౌహాన్, హెచ్సీఎస్సీ సెక్రటరీ జనరల్ అవినాశ్ చుక్కపల్లి, ట్రాఫిక్ ఫోరం జాయింట్ సెక్రటరీ పియూష్ అగర్వాల్ పాల్గొన్నారు. అనంతరం 45 మంది బెస్ట్ వీ కాప్స్ను గుర్తించి సీపీ సన్మానించారు. మరోవైపు సండే ఫన్డేలో భాగంగా ట్యాంక్బండ్, చార్మినార్కు సందర్శకులు పోటెత్తారు. ముఖ్యంగా పెద్దలు తమ పిల్లలతో కలిసి తిరుగుతూ సందడి చేశారు. స్టాళ్లలో నచ్చిన వస్తువులను కొన్నారు.