తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 14: పరిణతవాణి ప్రసంగాలు సాహిత్య చరిత్ర నిర్మాణానికి దోహదం చేస్తాయని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 11 రోజుల పాటు కొనసాగనున్న పరిణతవాణి ప్ర సంగాల పరంపర కార్యక్రమం సోమవారం ప్రారంభమైం ది. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ, విద్యా వ్యాప్తికి, సాంస్కృతిక కళా రంగాలకు, తెలుగు సాహిత్య వికాసానికి తెలంగాణ సారస్వత పరిషత్తు అవిరళ కృషి చేస్తున్నదని చెప్పారు. మహోన్నత కవి పండితులు, రచయితల సాహిత్య జీవితం గురించి వారి చేత ప్రసంగాలు చేయిస్తూ నేటి తరాలకు మరుగున పడిన సాహితీవేత్తలను పరిచయం చేస్తున్నదని తెలిపారు. అలా చేయడమే కాకుండా వారి సాహితీ ఘట్టాలను, చరిత్రలను పుస్తక రూపంలో ముద్రిస్తూ భావి తరాల కోసం గొప్ప వారసత్వ సంపదగా అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, సాహిత్య పరిశోధకులు అందించే సమాచారం భావితరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ, సాహితీమూర్తుల జీవన, సాహితీ విశేషాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు. ప్రముఖ పరిశోధకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు ననుమాస స్వామి పరిణతవాణి 90వ ప్రసంగం చేశారు.