సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, ఫంక్షనల్ వర్టికల్స్లో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ రాష్ట్రంలోనే టాప్లో నిలిచిందని, దీనిని ఇతర యూనిట్ అధికారులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్రైం రివ్యూ అండ్ ఫంక్షనల్ వర్టికల్స్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ క్రైం రివ్యూ అండ్ ఫంక్షనల్ వర్టికల్స్ పనితీరులో గడిచిన 5నెలలుగా సైబరాబాదే టాప్లో నిలుస్తోందన్నారు. ఇది సంతోషించదగిన విషయమని, దీనిని రాష్ట్రంలోని అన్ని యూనిట్లు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
లాంగ్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించడం, పోక్సో కేసుల పరిష్కారం, వారెట్ల జారీ, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ క్రైం తదితర వాటిల్లో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ మొదటి స్థానంలో నిలిచిందని, 12 ప్రధాన అంశాల్లో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రతో పాటు ఆయా జోనల్ డీసీపీలు, ఇతర సిబ్బందిని డీజీపీ మహేందర్రెడ్డి అభినందించారు. ఈ సమీక్షా సమావేశంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి, క్రైం డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, షీ టీమ్స్ డీసీపీ కవిత, అడ్మిన్ డీసీపీ ఇందిర తదితరులు పాల్గొన్నారు.