ముషీరాబాద్, నవంబర్ 11: ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వం నచ్చిన రాష్ట్రంతో ఒకలా నచ్చని రాష్ట్రంలో మరోలా వ్యవహరిస్తున్నదని టీఆర్ఎస్ గ్రేటర్ నేత ఎంఎన్.శ్రీనివాసరావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి కల్పించిన సౌకర్యాలతో రైతులు పంటలు పండిస్తే ధాన్యం కొనబోమంటూ బీజేపీ ప్రభుత్వం రైతులను వేధింపులకు గురిచేస్తున్నదని అన్నారు. గురువారం ఆయన ఇందిరాపార్కు వద్ద టీఆర్ఎస్ నిర్వహించతలపెట్టి ధర్నా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాల్గొంటారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.