ఖైరతాబాద్, ఫిబ్రవరి 9: సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు సోమాజిగూడలోని రాజీవ్ చౌరస్తాలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు నల్లబ్యాడ్జీలు, జెండాలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రజల అస్తిత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, దీనిపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు. స్వరాష్ట్రం కోసం సుధీర్ఘంగా సాగిన పోరాటాల ఫలితంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణను ప్రకటించిందన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా ఆవిర్భవిస్తున్న తరుణంలో ఓర్వలేని కేంద్రం అభివృద్ధిని కుంటుపర్చేలా వ్యవహరిస్తున్నదన్నారు. ఇప్పటి వరకు విభజన హామీలు నెరవేర్చలేదని, రావాల్సిన నిధులు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి, ఆ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెబుతారన్నారు. అనంతరం ఎమ్మెల్యే దానం, సోమాజిగూడ, వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్లు వనం సంగీత యాదవ్, మన్నె కవితారెడ్డి, జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్పర్సన్ కె.ప్రసన్నతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రాజ్భవన్ రోడ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా గన్పార్కు వరకు సాగింది. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఖైరతాబాద్, సోమాజిగూడ డివిజన్ల అధ్యక్షులు అరుణ్ కుమార్, ఎస్కె అహ్మద్, ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు, మాజీ కార్పొరేటర్ లక్ష్మినారాయణమ్మ, వనం శ్రీనివాస్ యాదవ్, రామ్మూర్తి, సలావుద్దీన్, రజినీ పాల్గొన్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ
బంజారాహిల్స్, ఫిబ్రవరి 9: తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. తెలంగాణ ప్రజలను అవమానించేలా విభజనపై ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో బుధవారం భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, బంజారాహిల్స్, ఖైరతాబాద్,. సోమాజిగూడ డివిజన్ల పరిధిలో టీఆర్ఎస్ కార్యకర్తలు నల్ల జెండాలతో మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఫిలింనగర్, బంజారాహిల్స్ రోడ్ నెం 2, రోడ్ నెం 12. పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల గుండా సాగిన ర్యాలీ గన్పార్క్వద్దకు చేరుకున్నది. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ర్యాలీలో కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, వనం సంగీతాయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న రామ్మూర్తి, టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, వనం శ్రీనివాస్యాదవ్, రాములు చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.