ఖైరతాబాద్/సుల్తాన్బజార్: ఫిబ్రవరి 8 : దళితులు రాజకీయ నేతల ఉచ్చులో పడొద్దు.. వర్గీకరణ పేరుతో విడదీయాలని కుట్ర చేస్తున్నారు.. ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకుందాం.. అని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలంగాణ, ఏపీ రాష్ర్టాల చైర్మన్ జి. చెన్నయ్య, చీఫ్ కో ఆర్డినేటర్ కె. బాలకృష్ణ కోరారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎబీసీడీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని ఆ పార్టీల పెద్దలు పదవుల నుంచి బర్తరఫ్ చేయాలన్నారు.
వర్గీకరణ పేరుతో దళితుల మధ్య కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కుట్రలు చేస్తున్నాడని, వాటిని తిప్పికొట్టి, రాబోయే రోజుల్లో కిషన్రెడ్డి ఎక్కడి నుంచి పోటీచేసినా మాలలంతా ఏకమై ఓడిస్తారన్నారు. వర్గీకరణకు మద్దతునిచ్చే ఏ పార్టీనైనా వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మార్చి 13న నగరంలో పది లక్షల మందితో సింహగర్జన నిర్వహిస్తామన్నారు. అనంతరం సింహగర్జన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సమితి నాయకులు చెరుకు రాంచందర్, ఎస్.మోహన్, బాలకిషన్, ఎన్. కనకరాజు, నర్సింహ్మయ్య, బూర్గుల వెంకటేశ్వర్లు, పిల్లి సుధాకర్, జంగా శ్రీనివాస్ పాల్గొన్నారు.