కొండాపూర్, నవంబర్ 11 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా విధానాన్ని (ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) వెంటనే రద్దు చేయాలంటూ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) విభాగం ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్ఈపీ విద్యా వ్యవస్థతో పాటు విద్యార్థుల స్వేచ్ఛను హరించేలా ఉందని, ఉన్నత విద్యా అభ్యసన సమయాన్ని సైతం తగ్గించేలా ఉందని వర్సిటీ ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు సహనా పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా నూతన చట్టాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. నూతన ఎడ్యుకేషన్ పాలసీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.