సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలం నేపథ్యంలో జలమండలి సురక్షిత నీటి సరఫరాకు పకడ్భందీ చర్యలు చేపడుతున్నది. వినియోగదారుల ఇంటి నిల్వ సంప్ వర్షపు నీటిలో కలిసి ఉంటే ..ట్యాంకులను, సంపులలో బ్లీచింగ్ పౌడర్తో శుభ్రపరిచాలని అవగాహన కల్పిస్తున్నది. ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలను పంపిణీ చేస్తున్నది. జలమండలి సరఫరా నీటితో నింపుకుని ఆ నీటిలో క్లోరిన్ మాత్రలను కలిపి నీటిని వాడుకోవాలని సూచిస్తోంది. ముఖ్యంగా నీటి సేకరణ నుంచి సరఫరా వరకు మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియను అవలంభిస్తున్నారు. మొదటి విడతగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల వద్ద క్లోరినేషన్ ప్రక్రియ, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల వద్ద, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ చేస్తున్నారు. ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బస్తీల్లో క్లోరిన్ బిళ్లలు పంపిణీ
నగరంలోని బస్తీలు, వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి సరఫరాపై జలమండలి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. ఇళ్లలో నిల్వ చేసుకున్న నీటి నాణ్యతపై కూడా దృష్టి సారించి, నిల్వ చేసిన నీటిని శుద్ధి చేసుకోవడం కోసం ప్రజలకు క్లోరిన్ బిళ్లలను పంపిణీ చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో ఈ క్లోరిన్ బిళ్లలను పంపిణీ చేస్తుండడంతోపాటు వీటిని ఉపయోగించి నీటిని ఎలా శుద్ధి చేసుకోవాలనే కూడా అవగాహన కల్పిస్తున్నారు. జలమండలి పరిధిలో 12 లక్షల మంది వినియోగదారులుండగా, కృష్ణా, గోదావరి, సింగూరు, గండిపేట, హిమాయత్సాగర్ రిజర్వాయర్ల నుంచి నిత్యం 468 మిలియన్ గ్యాలన్లకు పైగా నీటిని సరఫరా అవుతోంది. నీటిశుద్ధి కేంద్రాల వద్ద శుద్ధి చేసిన నీటిని నగరంలోని దాదాపు 200 సర్వీస్ రిజర్వాయర్లలోకి తరలిస్తున్నారు.