సికింద్రాబాద్, జనవరి25: దళిత బంధుతోనే ఎస్సీలకు ఆర్థిక పరిపుష్టి సాధ్యమని, దేశానికి దళిత బంధు పథకం దిక్సూచిగా మారనున్నదని టీఆర్ఎస్ సీనియర్ నేత, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆరే దళిత బంధును అమలు చేసి చూపిస్తున్నారన్నారు. కంసారి బజార్లోని మిలటరీ గేట్ నుంచి పుల్లారెడ్డి బంగ్లా వరకు చేపట్టిన నూతన బీటీ రోడ్డు పనులను మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో మార్చి 30వ తేదీలోపు దళితబంధు పథకం అమలయ్యేలా చర్యలు చేపట్టడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. త్వరలోనే దళితబంధు పథకం కంటోన్మెంట్ పరిధిలో కూడా అమలు కాబోతున్నదన్నారు. నియోజకవర్గ పరిధిలోని దళితులకు మంచి రోజులు రాబోతున్నాయని, ఎంతో ముందుచూపుతో సీఎం కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని జక్కుల మహేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు.
వార్డు అభివృద్ధే లక్ష్యం
రానున్న రోజుల్లో వార్డులో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి తెలిపారు. గతంలో తన హయాంలో చిన్నతోకట్ట ప్రధాన రహదారి నుంచి సెవన్ టెంపుల్ రోడ్ మీదుగా కంసారి బజార్ చాయ్ అడ్డా వరకు సుమారు రూ.72లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులు మంజూరయ్యాయని అన్నారు. వార్డులో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.